- Home
- Sports
- Cricket
- పాకిస్తాన్ మెరుగైన జట్టే కావొచ్చు.. కానీ ఫీల్డ్లో మాత్రం.. భారత్-పాక్ మ్యాచ్పై చాహల్ షాకింగ్ కామెంట్స్
పాకిస్తాన్ మెరుగైన జట్టే కావొచ్చు.. కానీ ఫీల్డ్లో మాత్రం.. భారత్-పాక్ మ్యాచ్పై చాహల్ షాకింగ్ కామెంట్స్
INDIA vs PAKISTAN: దాయాదుల మధ్య పోరు కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనేది అందరికీ తెలిసిందే. భారత్-పాక్ మధ్య టీ20 ప్రపంచకప్ సమరం ఈనెల 23న జరుగనున్నది.

ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పై ఘనమైన రికార్డు కలిగిన భారత జట్టుకు గతేడాది భారీ షాక్ తాకింది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించింది. ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో భారత్-పాక్ లు రెండుసార్లు తలపడగా చెరోసారి గెలుపు రుచిచూశాయి.
మరో 12 రోజుల్లో ఈ రెండు జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా బిగ్ ఫైట్ జరుగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ లు మరోసారి ఢీకొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దైనిక్ జాగరణ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్న చాహల్ మాట్లాడుతూ.. ‘మీరు ఇప్పటికే ఒక ప్రత్యర్థితో చాలా మ్యాచ్ లు ఆడినందువల్ల రాబోయే మ్యాచ్ లో వాళ్లను ఎదుర్కోవడం గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు.
అయితే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే సాధారణంగా ఉండే హైప్ ఐసీసీ టోర్నీలలో అధికంగా ఉంటుంది. దానికి మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ కారణాలు కావొచ్చు. కానీ మా క్రికెటర్లకు అది కూడా మిగతా జట్లతో ఆడినట్టుగా అది కూడా ఒక మ్యాచ్ మాత్రమే. అంతకుమించి ఎక్కువ ఆలోచిస్తే మ్యాచ్ లో ఒత్తిడి పెరుగుతుంది.
నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను. కానీ దాయాదుల మధ్య పోరు గురించి ఇతరులు ఏం రాస్తున్నారని.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేదానిమీద నేను పట్టించుకోను. జట్టుగా పాకిస్తాన్ మెరుగైన టీమ్ కావచ్చు. కానీ మ్యాచ్ రోజు పరిస్థితులకు అనుకూలంగా ఎవరు నాణ్యమైన క్రికెట్ ఆడతారో వాళ్లే విజేతలవుతారు. అంతా దానిమీదే ఆధారపడి ఉంటుంది...’ అని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇరు జట్ల మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో ఈనెల 23న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. సుమారు 80 వేల మంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను లైవ్ ద్వారా వీక్షించే అవకాశముంది.