- Home
- Sports
- Cricket
- టార్గెట్ ఎంతైనా పెట్టుకోనివ్వండి.. ఛేదనలో మొనగాడు మనకున్నాడు.. కోహ్లీపై దాదా భారీ ఆశలు
టార్గెట్ ఎంతైనా పెట్టుకోనివ్వండి.. ఛేదనలో మొనగాడు మనకున్నాడు.. కోహ్లీపై దాదా భారీ ఆశలు
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా భారత్ ఎదుట భారీ టార్గెట్ ను నిర్దేశించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆ జట్టు 296 పరుగుల లీడ్ లో ఉంది.

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయావకాశాలు ఎలా ఉంటాయనేది నేటి ఆటపై ఆధారపడి ఉంటుంది. ఆసీస్ 400 ప్లస్ టార్గెట్ పెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆస్ట్రేలియా టార్గెట్ 370 - 400 మధ్య నిలిపినా టీమిండియా పెద్దగా ఆందోళన చెందాల్సిన పన్లేదని.. భారత జట్టులో ప్రపంచంలోనే ఛేదనలో మొనగాడు అయిన విరాట్ కోహ్లీ ఉన్నాడని..మిగిలిన భారత బ్యాటర్లు మెరుగ్గా ఆడితే అదేం పెద్ద అసాధ్యమేమీ కాదని అన్నాడు.
మూడో రోజు ఆట ముగిసిన తర్వాత దాదా స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఈ మ్యాచ్ లో భారత జట్టు 370 నుంచి 400 మధ్య ఛేదించాల్సి వస్తే అప్పుడు అసలు ఆట మొదలవుతుంది. కానీ టీమిండియా చింతించాల్సిన పన్లేదు. ఎందుకంటే భారత్ కు వరల్డ్ బెస్ట్ ఛేజర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.
కోహ్లీతో పాటు ఇతర బ్యాటర్లు కూడా తమ సామర్థ్యం మేరకు ఆడితే ఇదేం పెద్ద విషయం కాదు. చివరి రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు...’అని గంగూలీ తెలిపాడు. కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగులే చేసి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి రెండో ఇన్నింగ్స్ లో కూడా వార్నర్ ను ఔట్ చేసిన సిరాజ్ పైనా దాదా ప్రశంసలు కురిపించాడు.
ఇక 18 నెలల తర్వాత టెస్టు జట్టులోకి కమ్ బ్యాక్ ఇచ్చి ఓవల్ లో భారత్ ను ఆదుకున్న అజింక్యా రహానే ను కూడా దాదా ప్రశంసల్లో ముంచెత్తాడు. తాను తన కెరీర్ లో ఎన్నో కమ్ బ్యాక్ లు చూశానని వాటన్నింటిలో ఇది చాలా స్పెషల్ అని కొనియాడాడు.
‘18 నెలల తర్వాత టెస్టు జట్టులోకి కమ్ బ్యాక్ ఇచ్చిన రహానే అద్భుతంగా ఆడాడు. నేను నా కెరీర్ లో ఎన్నో కమ్ బ్యాక్ లు చూశా. కానీ ఇది మాత్రం అద్భుతం. చాలా మంది రహానే పని అయిపోయిందన్నారు. భారత్ వంటి దేశంలో ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయిన బ్యాటర్ రీఎంట్రీ ఇచ్చి ఇటువంటి ఇన్నింగ్స్ ఆడటం మాములు విషయం కాదు..’అని రహానేను ప్రశంసల్లో ముంచెత్తాడు.