పాకిస్తాన్ క్రికెట్ను చంపేశారు, అవన్నీ అప్పుడే మరిచిపోయారా... షోయబ్ అక్తర్ సీరియస్ కామెంట్స్...
మొదటి వన్డే ఆరంభానికి ముందు పాకిస్తాన్ టూర్ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది న్యూజిలాండ్ జట్టు. సెక్యూరిటీ కారణాలతో ఆటగాళ్ల భద్రత దృష్ట్యా, టూర్ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది...
18 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్లో పర్యటించడానికి ఒప్పుకున్న న్యూజిలాండ్... సెక్యూరిటీ విషయంలో ముందే అనుమానాలు వ్యక్తం చేసింది. తొలుత న్యూజిలాండ్ అధికారులు, పాక్లో పర్యటించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి... అంతా బాగున్నాయని తెలిపిన తర్వాతే క్రికెటర్లు, పాకిస్తాన్లో అడుగుపెట్టారు...
పాకిస్తాన్లో క్వారంటైన్ పూర్తిచేసుకుని, ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొని... ట్రోఫీతో ఫోటోషూట్ కూడా చేసిన తర్వాత అర్ధాంతరంగా టూర్ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించడంపై పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు...
‘సెక్యూరిటీ అలర్ట్’ పేరుతో వన్డే, టీ20 సిరీస్ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు పాక్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్...
‘న్యూజిలాండ్, పాకిస్తాన్ క్రికెట్ను చంపేసింది...’ అంటూ కోపంగా ఉన్న ఎమోజీలను ట్వీట్ చేశాడు షోయబ్ అక్తర్... ఆ తర్వాత న్యూజిలాండ్ ఈ విషయాలను గుర్తుచేసుకోవాలంటూ మరో ట్వీట్ చేశాడు...
‘2019లో న్యూజిలాండ్లో జరిగిన క్రిస్ట్చర్చి దాడిలో 9 పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారు... అయినా పాకిస్తాన్, న్యూజిలాండ్కి మద్ధతుగా నిలిచింది...
కరోనా వైరస్తో ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో న్యూజిలాండ్లో పర్యటించింది పాక్ జట్టు. ఆ పర్యటనలో న్యూజిలాండ్ అధికారులు, పాక్ క్రికెటర్ల పట్ల చాలా హీనంగా ప్రవర్తించారు...’ అంటూ ట్వీట్లు చేశాడు షోయబ్ అక్తర్..
అయితే షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్లపై ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు... న్యూజిలాండ్, పాక్ క్రికెట్ చంపేసిందని అంటున్నావ్ కానీ చచ్చిన దాన్ని, ఎవ్వరైనా ఎలా చంపగలరు... అంటూ కామెంట్లు చేస్తున్నారు..
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సమయంలో క్రమశిక్షణతో ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే... అధికారులు అలాగే ప్రవర్తిస్తారని, కరోనా టైం ఎలా ఉండాలో కూడా తెలియని జట్టు మీదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు...