ఈసారి కూడా గెలిచేది మేమే... వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ విజయంపై బ్రెండన్ మెక్కల్లమ్ ధీమా..
టెస్టు ఫార్మాట్లో జరుగుతున్న మొట్టమొదటి ఐసీసీ మెగా టోర్నీ... వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్. రెండేళ్ల పాటు సాగిన ఈ మెగా ఫైట్ ఫైనల్లో పోరాడేందుకు న్యూజిలాండ్, భారత్ జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఫైనల్లో న్యూజిలాండ్కే విజయం దక్కుతుందని అంటున్నాడు కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు. మూడు రోజుల క్వారంటైన్ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటుంది.
అయితే భారత జట్టు ఇంగ్లాండ్తో దిగుతున్న సమయానికి న్యూజిలాండ్, ఆతిథ్య జట్టుతో టెస్టు మ్యాచ్ ఆడుతూ బిజీగా ఉంటుంది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి ముందు ఇంగ్లాండ్తో రెండు టెస్టులు ఆడబోతోంది న్యూజిలాండ్.
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అనుకుంటున్నా. టైటిల్ ఛాంపియన్ అవ్వడానికి న్యూజిలాండ్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
అక్కడి వాతావరణం, పిచ్, ఆటతీరు పరిగణనలోకి తీసుకుంటే భారత జట్టు విన్నింగ్ శాతం 40 అయితే, న్యూజిలాండ్కి 60 శాతం ఉంటుంది. అయితే కివీస్కి కూడా గెలుపు అంత ఈజీగా దక్కదు.
ఫైనల్ మ్యాచ్కి ముందు న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో రెండు టెస్టులు ఆడనుంది. ఇవి కివీస్ జట్టుకు బాగా ఉపయోగపడతాయి. ఫైనల్కి ముందు కావాల్సినంత ప్రాక్టీస్ దక్కడంతో పాటు అక్కడి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
న్యూజిలాండ్ జట్టుతో పోలిస్తే భారత జట్టుకి ఫైనల్కి ముందు టెస్టు ప్రాక్టీస్ ఉండదు. వాళ్లు టెస్టు మ్యాచ్ ఆడి రెండు నెలలు అవుతోంది. కాబట్టి ఫార్మాట్కి వాళ్లు అలవాటు పడడానికి సమయం పడుతుంది.
అదే టైమ్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్, బౌలర్లు... ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్లో గాడిలో పడతారు. ఈసారి టైటిల్ సాధించి తీరతాం...’ అంటూ కామెంట్ చేశాడు కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్.
న్యూజిలాండ్ కెరీర్లో సాధించిన ఒకే ఒక్క ఐసీసీ టైటిల్ 2000 ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఐసీసీ ఈవెంట్ ఫైనల్లో కూడా భారత జట్టును ఓడించి, టైటిల్ కైవసం చేసుకుంది కివీస్ జట్టు.
ఆ తర్వాత జరిగిన ఐసీసీ మెగా ఈవెంట్లలో కూడా భారత జట్టు, కివీస్ను ఓడించలేకపోయింది. అయితే గత 15 ఏళ్లలో ఒక్క ఐసీసీ ఫైనల్ కూడా గెలవలేకపోయింది న్యూజిలాండ్.