- Home
- Sports
- Cricket
- ఒక ఇన్నింగ్సులో పది వికెట్లు తీసినోన్నే పక్కనబెట్టారు.. బంగ్లాతో సిరీస్ కు అజాజ్ పటేల్ ను ఎంపికచేయని కివీస్
ఒక ఇన్నింగ్సులో పది వికెట్లు తీసినోన్నే పక్కనబెట్టారు.. బంగ్లాతో సిరీస్ కు అజాజ్ పటేల్ ను ఎంపికచేయని కివీస్
Ajaz Patel: ఇటీవల భారత్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లతో అతడు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్ లో భారత సంతతి ఆటగాడు, ఆ జట్టు స్పిన్నర్ అజాజ్ పటేల్ పది వికెట్ల ప్రదర్శన అతడిని జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మార్చడంలో ఏ మాత్రం ఉపయోగపడలేదు.
ముంబైలో భారత్ తో జరిగిన టెస్టులో అజాజ్ పటేల్.. తొలి ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో మొత్తం14 వికెట్లతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే ఈ పెర్ఫార్మెన్స్ కూడా అతడిని జట్టులో స్థానం సుస్థిరం చేయలేదు. త్వరలో బంగ్లాదేశ్ తో జరుగబోయే రెండు మ్యాచుల టెస్టు సిరీస్ లో ప్రకటించిన జట్టులో అతడి పేరు లేదు.
13 మందితో కూడిన ఈ జట్టులో మరో భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్రను ఎంపిక చేసిన కివీస్ క్రికెట్ బోర్డు.. అజాజ్ ను మాత్రం తీసుకోలేదు.
రచిన్ రవీంద్ర తో పాటు ఆల్ రౌండర్ డారెల్ మిచెల్ ను కూడా టెస్టు జట్టులోకి ఎంపిక చేసిన సెలెక్టర్లు.. అజాజ్ పై మాత్రం కరుణ చూపలేదు. దీనిపై ఆ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ కూడా విచారం వ్యక్తం చేశాడు. కానీ తన చేతుల్లో ఏమీలేదని, జట్టు ఎంపిక ప్రక్రియ సెలెక్టర్లు చూసుకుంటారని అన్నాడు.
ఇదిలాఉండగా.. ఈ సిరీస్ కు కూడా కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా అతడు ముంబై టెస్టులో కూడా ఆడలేకపోయాడు. మరో రెండు నెలల పాటు అతడు విశ్రాంతి తీసుకోనున్నట్టు సమాచారం.
విలియమ్సన్ స్థానంలో ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ టామ్ లాథమ్.. సారథిగా వ్యవహరిస్తాడు. ఇక టీమిండియాతో టెస్టు సిరీస్ కు దూరమైన ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టుతో చేరనున్నాడు.
అయితే ఉపఖండంలో స్పిన్ పిచ్ లు కావడంతోనే అజాజ్ పటేల్ ను జట్టులోకి తీసుకున్నారని, అతడిని వాడుకుని వదిలేశారని కివీస్ క్రికెట్ బోర్డు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్ లోని పిచ్ లు పేస్ కు అనుకూలంగా ఉంటాయి.
అక్కడ స్పిన్ బౌలర్లకు పెద్దగా పనుండదు. ఈ నేపథ్యంలోనే కివీస్ బోర్డు తాజాగా జట్టును ఎంపిక చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో సిరీస్ కు న్యూజిలాండ్.. ఏకంగా ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది.