ఎమ్మెస్ ధోనీ మొదలెట్టేశాడు... ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం చెన్నై చేరుకున్న మాహీ...
ఐపీఎల్ 2021 సీజన్లో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథి ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఫిబ్రవరి 12-13 తేదీల్లో జరిగే మెగా వేలం కోసం ఇప్పటికే చెన్నై చేరుకుని, టీమ్ మేనేజ్మెంట్తో చర్చలు సాగిస్తున్నాడు మాహీ...

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్లో భాగంగా కెప్టెన్ ఎమ్మెస్ ధోనీతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ, రుతురాజ్ గైక్వాడ్లను అట్టిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్...
రవీంద్ర జడేజాని ఫస్ట్ రిటెన్షన్గా రూ.16 కోట్లు చెల్లించబోతున్న సీఎస్కే, మాహీకి రూ.12 కోట్లు ఇవ్వబోతోంది. మొయిన్ ఆలీకి రూ.8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్కి రూ.6 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది...
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో 48 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తంతో జట్టుని నిర్మించాల్సి ఉంటుంది. గత సీజన్లో అదరగొట్టిన ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది సీఎస్కే...
ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్లతో పాటు సీఎస్కే జట్టులో కీలక సభ్యుడిగా ఉంటూ వచ్చిన సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేయాలని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్...
‘అవును, ఎమ్మెస్ ధోనీ చెన్నైకి చేరుకున్నారు. ఆయన ఐపీఎల్ వేలం చర్చల్లో పాల్గొంటారు. అంతేకాకుండా వేలంలో సీఎస్కే తరుపున పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే వేలంలో సీఎస్కే బెంచ్లో ఉండాలా? వద్దా? అనేది మాహీ ఇష్టం...’ అంటూ తెలియచేసింది చెన్నై సూపర్ కింగ్స్..
40 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ, 2022 సీజన్ తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే మొదటి రిటెన్షన్గా కాకుండా రెండో రిటెన్షన్గా ఉండేందుకే మాహీ నిర్ణయం తీసుకున్నాడు...
ఎమ్మెస్ ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడని భావిస్తున్న రవీంద్ర జడేజాకి మొదటి రిటెన్షన్ ఇవ్వాలని మాహీయే సూచించినట్టు సమాచారం...
ఐపీఎల్ 2021 సీజన్లో ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ని ఏకంగా రూ.9.25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే అంత పెట్టి కొన్న గౌతమ్కి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు...
రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మొయిన్ ఆలీని టాపార్డర్లో ఆడించిన ఎమ్మెస్ ధోనీ, ఛతేశ్వర్ పూజారాతో పాటు తెలుగు బౌలర్ హరిశంకర్ రెడ్డి, హరి నిశాంత్లకు కూడా అవకాశం ఇవ్వలేదు...
చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కుర్రాన్, ఈసారి ఐపీఎల్ 2022 సీజన్కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 2022 వేలానికి అతను రిజిస్టర్ చేయించుకోలేదు...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి 1418 ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా ఇందులో 270 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 903 అన్క్యాప్డ్ ప్లేయర్లు, 41 మంది అసోసియేటెడ్ ప్లేయర్లు ఉన్నారు....