ధోనీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు... సీఎస్కే బ్యాట్స్మెన్ ఎన్ జగదీశన్...
ఐపీఎల్లో మూడు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, కుర్రాళ్లకు పెద్దగా అవకాశాలు ఇచ్చి, ప్రోత్సాహించింది లేదు. 30+ ప్లేయర్లనే ఎక్కువగా నమ్ముకుని, సీనియర్ సిటిజన్స్ టీమ్గా పేరొందిన సీఎస్కేలో గత సీజన్ నుంచి కాస్త మార్పు కనిపిస్తోంది. దీనికి కారణం రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్ వంటి కుర్రాళ్లే.
ఐపీఎల్ 2020 సీజన్లో కుర్రాళ్లలో స్పార్క్ కనిపించలేదని, అందుకే వారికి తుదిజట్టులో అవకాశం ఇవ్వడం లేదని మహేంద్ర సింగ్ ధోనీ చేసిన కామెంట్లపై తీవ్ర దుమారం రేగింది.
‘కుర్రాళ్లకి కొన్ని అవకాశాలు ఇచ్చాం. అయితే వారిలో జట్టు విజయానికి కావాల్సిన స్పార్క్ కనిపించలేదు. అందుకే వారి కంటే అనుభవం ఉన్న ప్లేయర్లకి అవకాశం ఇవ్వాలని ఆలోచించాం’ అంటూ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి అనంతరం కామెంట్ చేశాడు ఎమ్మెస్ ధోనీ...
ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చాడు సీఎస్కే యంగ్ ప్లేయర్ ఎన్ జగదీశన్. ‘ధోనీ చెప్పిన మాటలు, మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. ఆ కామెంట్స్ మా గురించి కాదు.
రుతురాజ్ గైక్వాడ్, నేను... మాకు వచ్చిన అవకాశాలను చక్కగా వాడుకున్నాం. ఆయన చేసిన కామెంట్స్, జట్టు మొత్తానికి ప్రేరణ నింపేందుకు చేసినవి. ఆ కామెంట్లు సీనియర్లకు కూడా వర్తిస్తాయి.
జట్టులో లెజెండ్స్గా గుర్తించబడుతున్నవారిని పాయింట్ అవుట్ చేసి కామెంట్ చేయలేం. అందుకే సీనియర్లను బ్యాకప్ చేస్తూ కొన్నిసార్లు కామెంట్లు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన జూనియర్స్తో పాటు దూకుడు చూపించలేకపోతున్న అందర్నీ కలిపి అలా కామెంట్ చేశారు..’ అంటూ వివరణ ఇచ్చాడు తమిళనాడు ప్లేయర్ ఎన్ జగదీశన్.
ఐపీఎల్లో ఘనమైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, గత సీజన్లో ఘోరమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. వరుస ఓటములతో ఫ్లేఆఫ్ నుంచి దూరమైన మొదటి జట్టుగా నిలిచింది.
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీపై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. వాటిల్లో మొదటిది కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా పియూష్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదవ్ వంటి సీనియర్లను ఆడించడం. జాదవ్తో ధోనీకి ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే అతన్ని ఆడిస్తున్నారని వ్యాఖ్యలు వినిపించాయి.
అదీకాకుండా తొలి మ్యాచ్లోనే 30+పరుగులు చేసిన ఎన్ జగదీశన్కి ఆ తర్వాతి మ్యాచ్లో చోటు కల్పించకపోవడం తీవ్రమైన ట్రోలింగ్కి కారణమైంది. అయితే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత వరుసగా కుర్రాళ్లకు అవకాశం ఇచ్చాడు ఎమ్మెస్ ధోనీ...
చివరి మూడు మ్యాచుల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన రుతురాజ్ గైక్వాడ్, తనలోని స్పార్క్ను క్రికెట్ ప్రపంచానికి మొత్తం కనిపించేలా చూపించాడు. ఈ సీజన్లోనూ జట్టులో కీలక ప్లేయర్గా మారాడు రుతురాజ్.
మొదటి మ్యాచ్లోనే 30+ పరుగులు చేసిన జగదీశన్కి మాత్రం ఆ తర్వాత పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2021 సీజన్లోనూ ఒక్క మ్యాచ్లోనూ జగదీశన్ను ఆడించలేదు సీఎస్కే...
ఐపీఎల్ 2021 సీజన్లో మొదటి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్... జగదీశన్తో పాటు ఐపీఎల్ 2021 వేలంలో భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన కృష్ణప్ప గౌతమ్తో పాటు టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, సీనియర్ బ్యాట్స్మెన్ రాబిన్ ఊతప్పలను ఆడించలేదు సీఎస్కే.