ఐపీఎల్లో కరోనా కేసులు రావడానికి కారణం ఇదే... సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హుస్సీ కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆరంభించింది బీసీసీఐ. అయితే సీజన్ మధ్యలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో అర్ధాంతరంగా లీగ్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే బయో బబుల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడానికి కారణం ఇదేనంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హుస్సీ...
ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఇండియాకి వచ్చిన ఆసీస్ మాజీ క్రికెటర్, సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హుస్సీ కరోనా బారిన పడ్డాడు. క్వారంటైన్ పూర్తిచేసుకుని, నెగిటివ్గా తేలిన తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. తనకి కరోనా రావడానికి కారణం వేదిక మార్చడమే అంటున్నాడు హుస్సీ...
‘సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత నాకు కూడా కరోనా సోకి ఉంటుందని అనుమానం వచ్చింది. ఎందుకంటే టీమ్ బస్సులో అతను నా పక్కనే కూర్చునేవాడు. అయితే నాకు మొదటి పరీక్షలో వీక్ పాజిటివ్ వచ్చింది.
ఆ తర్వాతి పరీక్షలో నెగిటివ్ రావాలని కోరుకున్నా. కానీ పాజిటివ్గా వచ్చింది. అయితే అప్పటికే నాలో కొన్ని లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. అప్పుడు నాకు అర్థమైపోయింది. కరోనా వచ్చేసిందని...
ఐపీఎల్ కోసం బయో బబుల్ చాలా పటిష్టంగానే ఏర్పాటుచేశారు. ముంబైలో ఉన్నప్పుడు మాకు ఎలాంటి రిస్క్ కనిపించలేదు. అయితే ముంబై నుంచి ఢిల్లీకి వేదిక మార్చడం వల్లే కరోనా కేసులు రావడానికి కారణమై ఉంటుంది...
ఎందుకంటే ముంబై బయో బబుల్ నుంచి ఢిల్లీ చేరుకున్నాక అక్కడ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఫ్లైట్ అంటెడర్స్ వంటివాళ్లతో మేం కలవాల్సి వస్తుంది. ఇది బయో బబుల్లో కరోనా పాజిటివ్ కేసులు రావడానికి కారణం అయి ఉండొచ్చు...
నాకు పాజిటివ్ రాగానే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే బయో బబుల్లో కరోనా బారిన పడడం అంటే అదొక తప్పిదమే. అందుకే చాలా బాధపడ్డాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం చాలా రిస్క్...’ అంటూ కామెంట్ చేశాడు మైక్ హుస్సీ...
మే 3న లక్ష్మీపతి బాలాజీతో పాటు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్, టీమ్ బస్ క్లీనర్ కరోనా బారిన పడగా, ఆ తర్వాతి రోజు మైక్ హుస్సీ కూడా కరోనా బారిన పడ్డట్టు తేలింది. వీరిని ఢిల్లీ నుంచి ప్రత్యేకవిమానం ద్వారా చెన్నైకి తరలించి వైద్యం ఇప్పింది సీఎస్కే యాజమాన్యం.
మే 13న కరోనా నుంచి కోలుకున్న మైక్ హుస్సీ.. అప్పటికీ మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ల బృందంతో కలవాలని భావించాడు. అయితే అప్పటికే భారత్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించింది మాల్దీవులు.
దీంతో చెన్నై నుంచి దోహా చేరుకున్న మైక్ హుస్సీ, అక్కడి నుంచి ఆస్ట్రేలియా చేరుకుని... ప్రస్తుతం సిడ్నీలోని హోటల్లో రెండు వారాలపాటు క్వారంటైన్లో గడుపుతున్నాడు.