గొంతు నొప్పి ఉన్నా, మీటింగ్కి వచ్చిన కృనాల్ పాండ్యా... ఆ విషయం చెప్పినా పట్టించుకోకుండా...
శ్రీలంక పర్యటనలో ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న కారణంగా మరో 8 మంది ప్లేయర్లు కూడా జట్టుకి దూరమయ్యారు. దీంతో ఏ మాత్రం అనుభవం లేని ప్లేయర్లతో బరిలో దిగిన భారత జట్టు... టీ20 సిరీస్ కోల్పోయింది...
శ్రీలంక టూర్లో కరోనా బారిన పడి, ఆతిథ్య జట్టు సిరీస్ గెలవడానికి పరోక్షంగా కారణమైన కృనాల్ పాండ్యాపై తీవ్రస్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. శ్రీలంక సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించినందుకు కృనాల్కే ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ ఇవ్వాలంటూ ట్రోల్ చేశారు నెటిజన్లు...
అయితే ఆ విషయంలో కృనాల్ పాండ్యా తప్పేం లేదట. తనకి గొంతు నొప్పి వస్తుందని భారత క్రికెట్ బోర్డు వైద్యాధికారిని కృనాల్ ముందుగానే తెలిపినా, అతని నుంచి మాత్రం అవసరమైన స్పందన రాలేదని తాజా విచారణలో తేలింది..
జూలై 25న జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో 38 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా, షెడ్యూల్ ప్రకారం జూలై 27న రెండో టీ20 ఆడాల్సింది. అయితే కృనాల్ పాండ్యా కరోనా బారిన పడడంతో మ్యాచ్ను అర్ధాంతరంగా జూలై 28కి వాయిదా వేశారు...
‘జూలై 26న కృనాల్ పాండ్యా గొంతు నొప్పి వస్తుందని, బీసీసీఐ వైద్యాధికారిని కలిసి విషయం చెప్పాడు. గొంతు నొప్పి వస్తుందని చెబితే, వెంటనే ర్యాపిడ్ టెస్టు చేసి, ఆ రిజల్ట్ వచ్చేవరకూ ముందు జాగ్రత్తగా అతన్ని ఐసోలేషన్కి పంపించాలి...
అయితే బీసీసీఐ ప్రధాన వైద్యాధికారి అభిజిత్ సల్వీ మాత్రం అలా చేయలేదు. ఏం పర్లేదని చెప్పి, కృనాల్ పాండ్యాను టీమ్ మీటింగ్కి పంపించాడు... అభిజిత్ సరైన సమయానికి స్పందించి, కృనాల్కి టెస్టు చేసి, అతన్ని ఐసోలేషన్కి పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది...
అతను మిగిలిన జట్టు సభ్యులను కలిసే వాడు కాదు, మరో 8 మంది ప్లేయర్లను ఐసోలేషన్లో పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు... అప్పటికప్పుడు చేయకుండా ఆ తర్వాతి రోజు చేసిన కరోనా పరీక్షల్లో కృనాల్కి పాజిటివ్ వచ్చింది...
ఏకంగా 8 మంది ప్లేయర్లు, జట్టుకి దూరం కావడంతో టీ20 సిరీస్ను రద్దు చేయాలని బీసీసీఐ భావించింది. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం, సిరీస్ను పూర్తి చేయాలని పట్టుబట్టారు... ఈ విధంగా శ్రీలంక జట్టుకి మేలు జరిగింది...’ అంటూ తెలిపారు ఓ బీసీసీఐ అధికారి...
కృనాల్ పాండ్యాకి పాజిటివ్ రాగా, అతనితో క్లోజ్ కాంట్రాక్ట్ ఉండడంతో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా, హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్, దీపక్ చాహార్, మనీశ్ పాండే, కృష్ణప్ప గౌతమ్, ఇషాన్ కిషన్... వంటి ప్లేయర్లు కూడా భారత జట్టుకి దూరమయ్యారు...
వీరిలో యజ్వేంద్ర చాహాల్, కృష్ణప్ప గౌతమ్ కరోనా పాజిటివ్గా తేలడంతో కృనాల్ పాండ్యాతో పాటు ఐసోలేషన్ ముగించుకుని ఆలస్యంగా స్వదేశానికి తిరిగి వచ్చారు...