Virat Kohli: సచిన్ రికార్డులను బ్రేక్ చేయాలంటే కోహ్లీ టీ20లను వదిలేయాలి.. లేకుంటే కష్టమే..
Shoaib Akhtar on Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్ లో భారత బ్యాటింగ్ దిగ్గజం నెలకొల్పిన రికార్డులలో ఒకటైన వంద సెంచరీల ఘనతను అధిగమించడం కోహ్లీ ముందున్న అతిపెద్ద సవాల్.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ లో ఇప్పటికే 70 సెంచరీలు చేశాడు. అయితే అతడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వంద శతకాల రికార్డును బద్దలుకొట్టాలంటే టీ20 ఫార్మాట్ ను వదిలేయాలంటున్నాడు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ షోయభ్ అక్తర్.
ఆసియా కప్-2022లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘నెల రోజుల తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ తన మునపటి ఆటను ఆడుతున్నాడు. పాకిస్తాన్ తో పాటు హాంకాంగ్ తోనూ కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేశాడు. టోర్నీలో రాబోయే మ్యాచ్ లలో కూడా అతడు ఇలాగే ఆడాలి.
అయితే కోహ్లీకి నేనిచ్చే సలహా ఏంటంటే.. అతడు వీలైనంత త్వరగా టీ20 ఫార్మాట్ ను వదిలేయాలి. రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత అతడు ఈ ఫార్మాట్ లో కొనసాగాలో లేదో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కోహ్లీ మరో 30 సెంచరీలు చేయాలంటే మూడు ఫార్మాట్లలో ఆడితే ఆ రికార్డును అందుకోవడం కష్టం.
కోహ్లీ ఇప్పటికే తానెంటో నిరూపించుకున్నాడు. ఇక ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ గా మారాలంటే అతడు సచిన్ వంద సెంచరీల రికార్డును బద్దలుకొట్టాలి. అలా జరగాలంటే కోహ్లీ టెస్టులు, వన్డేల మీద ఎక్కువ దృష్టిపెట్టాలి..
Image credit: PTI
సచిన్ రికార్డును బ్రేక్ చేయాలంటే టెస్టు, వన్డేలలో ఎక్కువగా ఆడితేనే సాధ్యమవుతుంది. టీ20లలో అంత సమయం ఉండదు. ఇక్కడ ధనాధన్ ఆడే క్రమంలో సెంచరీ చేయడం చాలా అరుదు. కానీ టెస్టు, వన్డేలలో ఆ అవకాశం పుష్కలంగా ఉంది. కోహ్లీ.. సచిన్ వంద సెంచరీల రికార్డును బ్రేక్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రస్తుతానికి ఈ రికార్డు బ్రేక్ చేయడం కాస్త కష్టంగానే కనిపిస్తున్నా కోహ్లీ దానిని సాధిస్తాడని నాకు నమ్మకముంది..’ అని చెప్పాడు.
2019 లో బంగ్లాదేశ్ మీద సెంచరీ చేశాడంటే ఆ తర్వాత మూడేండ్లు గడుస్తున్నా కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ చేయలేదు. అతడి కంటే వెనుక ఉన్న జో రూట్, స్టీవ్ స్మిత్ లు ఈ రెండేండ్లలో మెరుగైన ప్రదర్శనలు చేస్తే కోహ్లీ మాత్రం దారుణంగా విఫలమవుతూ విమర్శల పాలవుతున్నాడు.