Sourav Ganguly: దాదా బయోపిక్.. డైరెక్ట్ చేయనున్న సూపర్ స్టార్ కూతురు..?
Sourav Ganguly Biopic: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ బయోపిక్ గురించి గత కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఆయనను డైరెక్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

టీమిండియా మాజీ సారథి, కోల్కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ జీవిత కథను కూడా వెండితెరపై చూడబోతున్నామా..? ఆ మేరకు వెండితెర వెనకాల జరగాల్సిన పనులు (ప్రీ ప్రొడక్షన్) కూడా చకచకా జరుగుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
ఐపీఎల్-15 తో పాటు బీసీసీఐ పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న దాదా.. తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలు, ఆసక్తికర సంఘటనల గురించి కథకులతో చర్చిస్తున్నారని టాక్ నడుస్తున్నది.
తమిళ తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్.. గంగూలీ బయోపిక్ ను తెరకెక్కించే పనుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఆమె ఇప్పుడు కోల్కతా వెళ్లడమే గాక గంగూలీతో కూడా సమావేశమైనట్టు తెలుస్తున్నది.
ఇన్సైడ్ స్పోర్ట్స్ కథనం మేరకు.. దాదా బయోపిక్ ను ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య అండ్ టీమ్.. మరింత సమాచార సేకరణ కోసం కోల్కతా కు కూడా వెళ్లారు.
కోల్కతాలో ఈడెన్ గార్డెన్ లో ప్రస్తుతం ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్ జరుగుతున్నాయి. తన సొంత నగరం.. సొంత స్టేడియంలో జరుగుతున్న మ్యాచులను సమర్థవంతంగా నిర్వహించేందుకు గంగూలీ దగ్గరుండి పనులన్నీ చూసుకుంటున్నాడు. ఈ గ్యాప్ లోనే ఆయన.. ఐశ్వర్యతో మంగళవారం రాత్రి డిన్నర్ కూడా చేసినట్టు తెలుస్తున్నది.
తన సినిమాకు సంబంధించిన ఇన్పుట్స్ తీసుకోవడానికే ఐశ్వర్య.. గంగూలీని కలిసిందని చెబుతుండగా.. మరికొంతమందేమో అలాంటిదేమీ లేదని.. ఆమె ఐపీఎల్ ను చూడటానికే తన పిల్లలతో కలిసి కోల్కతాకు వెళ్లిందని కూడా అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది కొద్దిరోజుల్లో తేలనుంది.
బాలీవుడ్ లో కొన్నాళ్లుగా బయోపిక్ ల తంతు నడుస్తున్న విషయం తెలిసిందే. ధోని, సచిన్, కపిల్ దేవ్ (83 ప్రపంచకప్ నేపథ్యం), మిల్కా సింగ్ (భాగ్ మిల్కా భాగ్) ల జీవితాల మీద సినిమాలు వస్తున్న నేపథ్యంలో గంగూలీ బయోపిక్ కూడా వస్తే బాగుంటుందని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదే విషయమై గతేడాది మార్చిలో దాదా కూడా తన ట్విటర్ వేదికగా.. లవ్ ఫిలిమ్స్ తన బయోపిక్ ను ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపిస్తుందని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను లవ్ రంజన్ డైరెక్ట్ చేస్తాడని కూడా అందులో పేర్కొన్నాడు. అయితే ఇంతవరకు దాని గురించిన అప్టేడ్ బయటకు రాలేదు.
కానీ తాజాగా దాదా బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్నట్టు ఐశ్వర్య పేరు వినిపిస్తుంటం గమనార్హం. ఐశ్వర్య 2010 లో ధనుష్, శృతి హాసన్ లు హీరోహీరోయిన్లుగా ‘3’ సినిమాను డైరెక్ట్ చేసింది. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’ తో పాటు ‘సినిమా వీరన్’ అనే డాక్యుమెంటరీ కూడా తీసింది.