IPL లోన్ విండో తెరుచుకుంది... ముంబై ఆ ప్లేయర్లను రాజస్థాన్కి ఇస్తుందా...
కరోనా పుణ్యమాని, ఇండియన్ ప్రీమియర్ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా వింత సమస్యను ఎదుర్కుంటోంది రాజస్థాన్ రాయల్స్. ఆ జట్టుతో పాటు దురదృష్టాన్ని బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుని తిరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కూడా ఇబ్బంది ఎదురైంది...
ఐపీఎల్ 2021 సీజన్లో స్టార్ ఆటగాళ్లతో లీగ్ను ప్రారంభించింది రాజస్థాన్ రాయల్స్. అయితే గ్రూప్ దశలో సగం మ్యాచులు కూడా ముగియకముందే నలుగురు విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి పయనమయ్యారు. ఆర్చర్ గాయం కారణంగా ఇక్కడికి రాకుండానే సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
బెన్ స్టోక్స్ మొదటి మ్యాచ్లో గాయపడి స్వదేశానికి పయనం కాగా లియామ్ లివింగ్స్టోన్, ఆండ్రూ టై... దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా భయంతో ఆస్ట్రేలియాకి పయనమయ్యాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఫారిన్ ప్లేయర్ల కొరతతో బాధపడుతోంది.
ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్లో రూ.16.25 కోట్లు పెట్టి కొన్న క్రిస్ మోరిస్తో పాటు డేవిడ్ మిల్లర్, ముస్తఫిజుర్ రెహ్మాన్, జోస్ బట్లర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరితో గాయపడినా, పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా ప్లేయర్ను మార్చేందుకు మరో ఆప్షన్ లేదు...
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా కూడా కరోనా భయంతో స్వదేశానికి పయనమయ్యారు. అయితే ఇప్పటికీ వారి వద్ద ప్లేయర్లు చాలామందే ఉన్నారు. డానియల్ సామ్స్, కేల్ జెమ్మిసీన్, ఏబీ డివిల్లియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, డాన్ క్రిస్టియన్, ఫిన్ ఆలెన్... ఆర్సీబీకి అందుబాటులో ఉన్నారు.
విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో లోన్ విండో 2021ను యాక్టివేట్ చేసింది రాజస్థాన్ రాయల్స్. మిగిలిన జట్లలో ఎక్కువగా ఉన్న, రిజర్వు బెంచ్లో ఖాళీగా కూర్చుంటున్న విదేశీ ప్లేయర్ను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతోంది...
లీగ్లో ఇప్పటిదాకా సొంత జట్టు తరుపున 2 మ్యాచులు, అంతకంటే తక్కువ మ్యాచులు ఆడిన ప్లేయర్ను లోన్ విండో ద్వారా వేరే ఫ్రాంఛైజీకి విక్రయించే అవకాశం ఉంటుంది. దీన్ని చాలా సీజన్లుగా ఎవ్వరూ ఉపయోగించుకోవడం లేదు.
మిగిలిన జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్ రిజర్వు బెంచ్లో మంచి స్టార్ ప్లేయర్లు ఖాళీగా కూర్చున్నారు. పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్, డి కాక్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్న ముంబై ఇండియన్స్... మిగిలిన ప్లేయర్లను రిజర్వు బెంచ్లో కూర్చోబెడుతోంది.
నాథన్ కౌంటర్నీల్తో పాటు జేమ్స్ నీశమ్, క్రిస్ లీన్, ఆడమ్ మిల్నే, మార్కో జాన్సెన్ వంటి ప్లేయర్లు ముంబై ఇండియన్స్ రిజర్వు బెంచ్లో ఉన్నారు. వీరిలో లీన్, మిల్నే ఒక్కో మ్యాచ్ ఆడగా. జాన్సెన్ రెండు మ్యాచులు ఆడాడు.
మొదటి మ్యాచ్లోనే 49 పరుగులు చేసిన క్రిస్ లీన్కి ఆ తర్వాత అవకాశం రాలేదు. అలాగే జేమ్స్ నీశమ్, ఐపీఎల్ 2021 సీజన్లో నీళ్లు మోస్తున్నా, లేదా నీళ్లపై తేలుతున్నా అంటూ తెగ ఖాళీగా ఉన్నానంటూ పోస్టు చేశాడు.
అయితే రాజస్థాన్ రాయల్స్ ప్రతిపాదనకి ముంబై ఇండియన్స్ ఒప్పుకుంటుందా? అంటే అనుమానమే. ఐదు సార్లు టైటిల్ ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్, కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్లను రిజర్వు బెంచ్లో ఖాళీగా కూర్చోబెట్టడానికైనా ప్రాధన్యం ఇస్తారు కానీ, వేరే జట్లలోకి వదలరు.
2020 సీజన్లో కేవలం 15 మంది ప్లేయర్లతోనే ఆడి, టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్... క్రిస్ లీన్, మెక్లగాన్ వంటి విదేశీ ప్లేయర్లకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు...
అదీకాక ఐపీఎల్ 2021 సీజన్లో ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, తన ప్లేయర్లను వదులుకోవడానికి ఇష్టపడకపోవచ్చని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.