రూ. 18 కోట్లు పెట్టి అనుభవాన్ని కొనలేరు : సామ్ కరన్ పై వీరూ విసుర్లు
IPL 2023: పంజాబ్ ఓటములపై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరన్ ను వేలంలో కొన్న నగదు విలువను ఉద్దేశిస్తూ.. రూ. 18 కోట్లు పెట్టినంత మాత్రానా అనుభవాన్ని కొనలేమని చెప్పాడు.

ఐపీఎల్ -16లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్సీ కొరత వేధిస్తోంది. తొలి నాలుగు మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించిన శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడి స్థానంలో వచ్చిన సామ్ కరన్ అనుభవరాహిత్యంతో ఆ టీమ్ కు ఓటములు తప్పడం లేదు. పంజాబ్.. ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడి మూడింట్లో గెలిచి మూడింట్లో ఓడి ఏడో స్థానంలో ఉంది.
కాగా పంజాబ్ ఓటములపై టీమిండియా మాజీ ఓపెనర్, గతంలో పంజాబ్ కు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరన్ ను వేలంలో కొన్న నగదు విలువను ఉద్దేశిస్తూ.. రూ. 18.50 కోట్లు పెట్టినంత మాత్రానా అనుభవాన్ని కొనలేమని చెప్పాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో లేనిపరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాక కరన్ పై వీరూ ఫైర్ అయ్యాడు.
వీరూ మాట్లాడుతూ.. ‘కరన్ అంతర్జాతీయ స్థాయి ఆటగాడు. కానీ మీరు అనుభవాన్ని రూ. 18 కోట్లతో కొనలేరు. అది మీకు ఆడుతుంటే వస్తుంది. నెత్తి మీద ఎండ మండుతుండగా ఆడాలి. వెంట్రుకలు తెల్లబడాలి. అదీ అనుభవమంటే.. అది ఆడటం ద్వారానే వస్తుంది’అని వ్యాఖ్యానించాడు.
‘అతడిని రూ. 18 కోట్లు పెట్టి కొన్నాం కాబట్టి కరన్ తమకు మ్యాచ్ లు గెలిపిస్తాడని భావించడం మూర్ఖత్వం. అతడికి ఇంకా అనుభవం లేదు. వికెట్ల మధ్య మరీ స్లోగా పరుగెత్తుతున్నాడు. వాస్తవానికి అక్కడ పరుగు అవసరం లేకున్నా వెళ్లి బొక్కబోర్లా పడ్డాడు. నువ్వు కెప్టెన్ గా ఉన్నప్పడు, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలి. అనుభవరాహిత్యమే అతడిని ముంచింది’ అని వ్యాఖ్యానించాడు.
గురువారం మొహాలీ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్.. 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు లో ప్రభ్సిమ్రన్ సింగ్ (46) టాప్ స్కోరర్ కాగా జితేశ్ శర్మ (41) పోరాడాడు. అయితే గత రెండు మ్యాచ్ లో పంజాబ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన కరన్.. బౌలర్ గా కాస్తో కూస్తో రాణిస్తున్నా బ్యాటర్ గా విఫలమవుతున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే కరన్.. 12 బంతులాడి 10 పరుగులే చేశాడు. లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు.
ధావన్ లేకపోవడంతో జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కెప్టెన్ గా కూడా కరన్ కొత్తే. బ్యాటింగ్ లో ధావన్ తో పాటు భానుక లు లేకపోవడం పంజాబ్ ను వేధిస్తోంది. కొత్త ఓపెనర్ అథర్వ తో పాటు ప్రభ్ సిమ్రన్, మాథ్యూ షార్ట్ లు అంతగా ఆకట్టుకోవడం లేదు.