ఇది కదా డెత్ ఓవర్ స్పెషలిస్టు బౌలింగ్ అంటే.. మోహిత్ శర్మపై ప్రశంసల వెల్లువ
IPL 2023: ఐపీఎల్-2023లో శనివారం మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ రసవత్తరంగా ముగిసిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో గుజరాత్ చివరి ఓవర్లో విక్టరీ కొట్టింది.

ఐపీఎల్ లో మరోమారు లో స్కోరింగ్ థ్రిల్లర్ ను చూశారు అభిమానులు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులే చేసింది. ఆ తర్వాత లక్నో 20 ఓవర్లు ఆడి ముక్కీ మూలిగి 128 పరుగులే చేయగలిగింది. గుజరాత్ విజయానికి ప్రధాన కారణం మోహిత్ శర్మనే అని చెప్పడంలో వన్ పర్సెంట్ డౌట్ కూడా లేదు.
ఒకప్పుడు ఐపీఎల్ లో పర్పుల్ క్యాప్ విన్నర్ గా ఉండి ఈ సీజన్ ముందు వరకూ నెట్ బౌలర్ గా మారిన మోహిత్.. ఆడింది రెండుమ్యాచ్ లే అయినా ఇరగదీస్తున్నాడు. మొన్న గుజరాత్ - పంజాబ్ తో మ్యాచ్ లోనే గాక నేటి లక్నోతో పోరులో కూడా అతడే మ్యాచ్ విన్నర్.
ఈ మ్యచ్ లో మోహిత్ ఆఖర్లో వేసిన రెండు ఓవర్లే లక్నో ఓటమికి గుజరాత్ విజయానికి కీలకమయ్యాయి. 18వ ఓవర్ కు ముందు ఒక్క ఓవర్ వేసిన అతడు ఏడు పరుగులిచ్చాడు. అప్పటికీ లక్నో 18 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో కెఎల్ రాహుల్, అయుశ్ బదోని ఉండగా మార్కస్ స్టోయినిస్ , దీపక్ హుడా వంటి హిట్టర్లు కూడా నెక్ట్స్ బ్యాటింగ్ లైనప్ లో ఉండటంతో లక్నో విజయంపై ధీమాగా ఉంది.
కానీ మోహిత్ వేసిన 18వ ఓవర్ ను చాలా పకడ్బందీగా విసిరాడు. ఈ ఓవర్ లో ఆరు పరుగులే వచ్చాయి. 19వ ఓవర్ షమీ వేశాడు. షమీ ఓవర్ లో కూడా ఐదు పరుగులే వచ్చాయి. అప్పటికీ లక్నో స్కోరు 124-3. విజయానికి ఆఖరి ఓవర్లో 12 పరుగులు కావాలి. గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యా మోహిత్ కు బంతినిచ్చాడు.
ఈ ఓవర్లో ఫస్ట్ బాల్ కు రెండు పరుగులొచ్చాయి. రెండో బాల్ రాహుల్ ఔట్. మూడో బాల్ స్టోయినిస్ అలా వచ్చి ఇలా వెళ్లాడు. హ్యాట్రిక్ బాల్. క్రీజులో హుడా. నాలుగో బాల్ హుడా లాంగాఫ్ దిశగా ఆడాడు. హ్యాట్రిక్ ను అడ్డుకున్నాడు. కానీ పరుగు తీసే క్రమంలో బదోని ఔటయ్యాడు. గుజరాత్ కు టీమ్ హ్యాట్రిక్ దక్కింది. అయినా గుజరాత్ శిబిరంలో ఇంకా టెన్షన్ తగ్గలేదు.
ఐదో బంతి కూడా హుడా.. మోహిత్ వేసిన యార్కర్ ను డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడబోయాడు. ఒక పరుగు పూర్తయింది. కానీ రెండో పరుగు తీసే క్రమంలో హుడా కూడా రనౌట్. అప్పుడు గుజరాత్ ఊపిరి పీల్చుకుంది. లక్నో అభిమానుల గుండె పగిలింది. చివరి బంతికి పరుగేమీ రాలేదు.
ఇది కదా డెత్ ఓవర్ బౌలింగ్ అంటే. క్రీజులో ప్రపంచ స్థాయి బ్యాటర్లు, మ్యాచ్ ను మలుపు తిప్పే హిట్టర్లు ఉన్నా తన మీద కెప్టెన్ పెట్టిన నమ్మకాన్ని మోహిత్ వమ్ము చేయలేదు. ఈ స్థాయి ప్రదర్శన చేశాడు కాబట్టే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతడి వద్దకే నడుచుకుంటూ వచ్చింది. ఈ సీజన్ లో ఇప్పటివరుకు రవీంద్ర జడేజా తర్వాత రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నది మోహిత్ శర్మనే కావడం గమనార్హం.
కాగా 2013 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ, ఆ సీజన్లో 15 మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి సీజన్లో 16 మ్యాచులు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. 2021 వేలంలో అమ్ముడుపోని మోహిత్ శర్మ, 2022 ఐపీఎల్ సమంలో గుజరాత్ టైటాన్స్ టీమ్లో నెట్ బౌలర్గా చేరాడు. అతని పర్ఫామెన్స్ నచ్చడంతో టీమ్లోకి తీసుకున్న గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అతన్ని తుది జట్టులో ఆడిస్తున్నది. పంజాబ్ తో మ్యాచ్ లో కూడా 4 ఓవర్లు వేసి 18 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.