హిట్మ్యాన్ రికార్డు బద్దలుకొట్టిన వార్నర్ భాయ్.. ఆ టీమ్ అంటే ఎంతిష్టమో..!
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో మరో అరుదైన రికార్డు బ్రేక్ చేశాడు. ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తున్న వార్నర్.. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ ను అధిగమించాడు.

Image credit: PTI
ఐపీఎల్ -16లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు విఫలమవుతున్నా కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. ఈ సీజన్ లో ఢిల్లీ ఆరు మ్యాచ్ లు ఆడి ఐదింటిలో ఓడి ఒక విజయం సాధించినా వార్నర్ మాత్రం నిలకడైన ప్రదర్శనలతో రాణిస్తున్నాడు. ఐపీఎల్ -16లో ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన వార్నర్ మరో ఘనతను అందుకున్నాడు.
ఢిల్లీ - కేకేఆర్ నడుమ గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో వార్నర్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు ముంబై సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. హిట్ మ్యాన్.. కేకేఆర్ పై 1,040 పరుగులు చేయగా ఢిల్లీ సారథి దానిని అధిగమించాడు. వార్నర్.. 1,075 పరుగులతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
నిన్నటి మ్యాచ్ కు ముందు ఐపీఎల్ లో ఒక ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్.. కేకేఆర్ పై 1,040 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. . కానీ వార్నర్ అర్థ సెంచరీ సాధించడం ద్వారా 1,075 పరుగులు సాధించి రోహిత్ రికార్డును అధిగమించాడు.
ఈ జాబితాలో వార్నర్, రోహిత్ తర్వాత శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. ధావన్.. చెన్నై సూపర్ కింగ్స్ పై 1,029 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో కూడా వార్నరే ఉన్నాడు. వార్నర్.. పంజాబ్ పై 1,005 రన్స్ సాధించాడు. ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కూడా చెన్నైపై 985 పరుగులు చేశాడు.
కేకేఆర్ తో మ్యాచ్ లో అర్థ సెంచరీతో వార్నర్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో వార్నర్ 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. ఛేజ్ మాస్టర్ కోహ్లీ.. ఛేదనలో 3,179 పరుగులు చేశాడు.
Image credit: PTI
ఈ జాబితాలో వార్నర్.. 3,036 పరుగులతో రెండో స్థానంలో ఉండగా రాబిన్ ఊతప్ప (2,832), శిఖర్ ధావన్ (2,707), రోహిత్ శర్మ (2,549) లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.