- Home
- Sports
- Cricket
- మొన్న ఆహా ఓహో అన్నారు.. ఇప్పుడు అబ్బే కష్టమే అంటున్నారు.. ఆదిలోనే అర్జున్కు తిప్పలు
మొన్న ఆహా ఓహో అన్నారు.. ఇప్పుడు అబ్బే కష్టమే అంటున్నారు.. ఆదిలోనే అర్జున్కు తిప్పలు
IPL 2023: ముంబై ఇండియన్స్ పేసర్, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పంజాబ్ తో మ్యాచ్ లో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు.

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ కెరీర్ ఆరంభంలోనే పొగడ్తలతో పాటు విమర్శలనూ ఎదుర్కుంటున్నాడు. ఐపీఎల్ లో 2021 నుంచి ముంబై ఇండియన్స్ తో ఉంటున్నా ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్ లెఫ్టార్మ్ పేసర్ గా ఎదుగుతున్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో చివరి ఓవర్ తెలివిగా బౌలింగ్ చేసి భువనేశ్వర్ వికెట్ తీసి అందరి ప్రశంసలు పొందాడు అర్జున్. తీసింది ఒక్క వికెట్టే అయినా మీడియా అతడికి భారీ ప్రాచుర్యం కల్పించడంతో అర్జున్ పేరు మార్మోగిపోయింది.
కానీ తీపి ఉన్నప్పుడు చేదు కూడా ఉండాలికదా. హైదరాబాద్ తో మ్యాచ్ లో నోరు తీపి చేసుకున్న అర్జున్.. నిన్న పంజాబ్ తో ముగిసిన మ్యాచ్ లో మాత్రం చేదును అనుభవించాల్సి వచ్చింది. పంజాబ్ తో పోరులో అర్జున్.. చెత్త ప్రదర్శనతో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
పంజాబ్ తో మ్యాచ్ లో తొలి రెండు ఓవర్లు బాగానే బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీసిన అర్జున్.. 16వ ఓవర్లో మాత్రం భారీగా పరుగులిచ్చుకున్నాడు. ఈ ఓవర్లో ఏకంగా 31 పరుగులిచ్చాడు. హర్ప్రీత్ బ్రర్, సామ్ కరన్ లు అర్జున్ బౌలింగ్ లో చెలరేగి ఆడారు. 15 ఓవర్ వరకూ నిదానంగా సాగుతున్న పంజాబ్ ఇన్నింగ్స్ ఆ ఓవర్ తర్వాత గేర్ మార్చింది.
కాగా 16వ ఓవర్లో 31 పరుగులు ఇవ్వడం ద్వారా అర్జున్.. ఈ సీజన్ లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్లలో గుజరాత్ పేసర్ యశ్ దయాల్ తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. దయాల్.. కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో రింకూ సింగ్ ఐదు సిక్సర్ల విధ్వంసానికి 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆ మ్యాచ్ తర్వాత గుజరాత్ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ అతడు ఆడలేదు.
Image credit: PTI
ఇక అర్జున్ విషయానికొస్తే ఒక్క ఓవర్ తో అంతా తలకిందులైంది. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తొలి వికెట్ తీశాక పొగిడినోళ్లే.. పంజాబ్ తో మ్యాచ్ తర్వాత మరీ చెత్త బౌలింగ్ వేశాడు అని వాపోతున్నారు. అర్జున్ ఓవర్ వల్లే పంజాబ్ ఇన్నింగ్స్ పుంజుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.