IPL 2021: పంజాబ్ కింగ్స్ ఘన విజయం... ముంబైకి వరుసగా రెండో ఓటమి...
ఐపీఎల్ 2021 సీజన్లో ముంబై ఇండియన్స్కి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ 140+ టార్గెట్ కూడా సెట్ చేయలేకపోయిన డిఫెండింగ్ ఛాంపియన్, పంజాబ్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.. ముంబై విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి చేధించింది పంజాబ్ కింగ్స్...
132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్కి ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. మొదటి ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చినా కృనాల్ పాండ్యా వేసిన రెండో ఓవర్ నుంచి దూకుడు పెంచారు మయాంక్, రాహుల్...
మొదటి వికెట్కి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్ అగర్వాల్, 20 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 25 పరుగులు చేసి రాహుల్ చాహార్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముంబై బౌలర్లు, నాలుగు ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో కొంత ఉత్కంఠ రేగింది...
అయితే జయంత్ యాదవ్ బౌలింగ్లో రెండు ఫోర్లు బాదిన యూనివర్సల్ బాస్ క్రిస్గేల్, డాట్ బాల్స్ ఆడినా వరుస విరామాల్లో బౌండరీలు బాదుతూ అవసరమైన రన్రేటు పెరగకుండా చూసుకున్నాడు.
18 బంతుల్లో 17 పరుగులు కావాల్సిన దశలో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో క్రిస్గేల్ మొదటి బంతికే సిక్సర్ బాదగా, కెఎల్ రాహుల్ వరుసగా ఓ సిక్సర్, ఫోర్ బాది మ్యాచ్ను ముగించాడు.
50 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు పూర్తిచేసుకున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, 52 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేయగా, క్రిస్గేల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
దీంతో 9 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది ముంబై ఇండియన్స్. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినా ముంబై ఇండియన్స్కి సంతోషాన్నిచ్చే విషయం ఏంటంటే, చెన్నైలో వారికిదే ఆఖరి మ్యాచ్.