IPL 2021 పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ దీపక్ హుడాపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు... ఇన్స్టాలో చేసిన పోస్టుతో...
IPL 2021 ఫేజ్2లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్, ఓ థ్రిల్లింగ్ సస్పెన్స్ మూవీని తలపించింది... ఆఖరి దాకా వన్సైడెడ్ అనుకున్న మ్యాచ్ కాస్తా... ఒకే ఒక్క ఓవర్లో అటు ఇటైపోయింది... అయితే ఈ మ్యాచ్పై చాలా అనుమానాలు రేగుతున్నాయి...
కెఎల్ రాహుల్ ఇచ్చిన మూడు క్యాచులను రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్లు నేలపాలు చేయడంతో ఆ అవకాశాలను చక్కగా వాడుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్, మయాంక్ అగర్వాల్తో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పాడు...
కెఎల్ రాహుల్ 49, మయాంక్ అగర్వాల్ 67 పరుగులు చేసి... మొదటి వికెట్కి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం... ఆ తర్వాత మార్క్రమ్, పూరన్ కలిసి మూడో వికెట్కి 57 పరుగులు జోడించడంతో ఈజీగా పంజాబ్ గెలుస్తుందని భావించారంతా...
మ్యాచ్ వన్సైడెడ్ అయిపోయిందని, చాలామంది టీవీలు ఆఫ్ చేసి పడుకున్నారు కూడా... అయితే ఆఖరి రెండు ఓవర్లలో సీన్ రివర్స్ అయిపోయింది... 12 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో ముస్తాఫిజుర్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి, పంజాబ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు..
ఆఖరి ఓవర్లో కొట్టాల్సింది 4 పరుగులే. బౌలింగ్ చేస్తున్నది 20 ఏళ్ల యంగ్ బౌలర్ కార్తీక్ త్యాగీ... క్రీజులో ఉన్న విండీస్ భారీ హిట్టర్ నికోలస్ పూరన్... భారీ సిక్సర్తో మ్యాచ్ను ముగించేస్తాడని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
అయితే ఆఖరి ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చిన కార్తీక్ త్యాగి... పూరన్తో పాటు దీపక్ హుడాను డకౌట్ చేసి... రాజస్థాన్ రాయల్స్కి ఊహించని విజయం అందించాడు..
అయితే ఐపీఎల్పై మ్యాచులపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని చాలామంది, ఇది పక్కా స్క్రిప్ట్డ్ మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 8 వికెట్లు చేతిలో ఉన్నప్పుడు 4 పరుగులు చేయలేక, ఓడిపోవడం ఏంటంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...
ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ దీపక్ హుడాపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది... హుడా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు బీసీసీఐ అధికారులు...
ఐపీఎల్ నియమాల ప్రకారం మ్యాచ్ ఆరంభానికి ముందు తుదిజట్టు గురించి తెలియచేసేలా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయకూడదు...
అయితే దీపక్ హుడా మాత్రం నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో పంజాబ్ కింగ్స్ జెర్సీ, హెల్మెట్ ధరిస్తున్న ఫోటోను పోస్టు చేసి... ‘మ్యాచ్కి సిద్ధం’ అనే అర్థం వచ్చేలా కాప్షన్ ఇచ్చాడు...
అంటే పరోక్షంగా నేటి మ్యాచ్లో తాను ఆడబోతున్నట్టు హింట్ ఇచ్చాడు దీపక్ హుడా. బీసీసీఐ యాంటీ కరెప్షన్ యూనిట్ (ACU) ఈ పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది...
‘యూఏఈలో ఐపీఎల్ మ్యాచులు మూడు వేదికల్లోనే జరుగుతున్నాయి. అలాగే కరోనా కారణంగా ఆటగాళ్ల కదలికలపై పూర్తి నిఘా ఉంది. అందుకే సోషల్ మీడియా ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ జరగొచ్చని మా అభిప్రాయం. అందుకే ఆటగాళ్ల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం...’ అంటూ తెలిపారు ఏసీయూ అధికారులు...
ఇప్పటికే కృనాల్ పాండ్యాతో గొడవ పడి, దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టుకి దూరమైన దీపక్ హుడా, ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజమైతే... కొన్నేళ్లపాటు క్రికెట్కి దూరమయ్యే ప్రమాదం ఉంది...
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లలో 37 పరుగులిచ్చిన దీపక్ హుడా, బ్యాటింగ్లో 2 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు... ఆఖరి ఓవర్లో హుడా డకౌట్ కావడంతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది...
అయితే సీజన్ ఫస్టాఫ్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64 పరుగులు చేసిన దీపక్ హుడా, పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు...