2021 ఐపీఎల్లో కొత్త జట్టు ఎంట్రీ... తొమ్మిదో టీమ్ కొనుగోలు చేయనున్న సౌత్ సూపర్ స్టార్!!
IPL 2020 సీజన్ విజయవంతంగా ముగిసింది. కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఐపీఎల్ 2020 సీజన్, దేశానికి దూరంగా యూఏఈలో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాల్సి వచ్చింది. అయితే వచ్చే సీజన్ మాత్రం జనాల మధ్య, భారత్లోనే నిర్వహించబోతున్నట్టు చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.
2020 సీజన్ ఐపీఎల్ ఫ్యాన్స్కి కావాల్సినంత మజాను అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులు, సూపర్ ఓవర్లు, ఏకంగా టీ20 చరిత్రలోనే మొట్టమొదటి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్కి వేదిక అయ్యింది 2020 సీజన్.
బేసి సంఖ్య సెంటిమెంట్ను బ్రేక్ చేస్తూ మొట్టమొదటిసారి సరి సంఖ్యతో ముగిసే ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్. ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా టాప్లోకి దూసుకెళ్లింది రోహిత్ సేన.
వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్- మే నెలల్లోనే జరగనుంది ఐపీఎల్ పండగ. అయితే వచ్చే ఏడాది నుంచి అదనంగా మరో జట్టును ఐపీఎల్లో ప్రవేశపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఛాలెంజింగ్ తీసుకుని టోర్నీ నిర్వహించడం వల్ల నష్టం కాస్త పూరినా, దాదాపు 40 శాతం ఆదాయాన్ని కోల్పోయింది బీసీసీఐ.
దీన్ని పూరించేందుకు అదనంగా ఓ కొత్త ప్రాంఛైజీని తీసుకురావాలని ఆలోచిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్లో మరో జట్టు చేరడం వల్ల ఆదాయం పెరుగుతుంది, మ్యాచులు పెరుగుతాయి. జనాల మధ్య స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించడం వల్ల బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తుంది.
కొత్త ఫ్రాంచైజీ కోసం త్వరలోనే మెగా వేలం నిర్వహించబోతున్నట్టు టాక్. అహ్మదాబాద్ పేరుతో కొత్త ఫ్రాంఛైజీ వస్తుందని ప్రచారం జరుగుతుంటే, మరోవైపు కేరళ పేరుతో కొత్త ఫ్రాంచైజీ వస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి.
సౌత్లోని హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఐపీఎల్లో ఫ్రాంఛైజీలు ఉన్నాయి. కేరళకి చెందిన కొచ్చి ఫ్రాంఛైజీ కొన్నాళ్లకే కనుమరుగైంది. దీంతో మళ్లీ ఐపీఎల్లో కేరళ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే జట్టును తేవాలని అనుకుంటున్నాడు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్లాల్.
ఆన్లైన్ లెర్నింగ్ అప్లికేషన్ బైజూస్తో కలిసి ఐపీఎల్లో ఫ్రాంఛైజీ కొనుగోలుకి మోహన్లాల్ ప్రయత్నిస్తున్నారని, ఐపీఎల్ 2020 ఫైనల్లో మోహన్లాల్ మెరవడానికి కారణం ఇదేనని అంటున్నారు కొందరు క్రికెట్ విశ్లేషకులు.
వచ్చే ఏడాది జనవరిలో కొత్త ఫ్రాంఛైజీతో 2021 ఏడాది ఆటగాళ్ల వేలం కూడా నిర్వహించబోతున్నారని సమాచారం. ఈ వేలంలో దాదాపు 70 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు.
ఈ వార్తలే నిజమైతే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తర్వాత ఐపీఎల్ టీమ్ సొంతం చేసుకున్న హీరోగా నిలుస్తాడు మోహన్లాల్. అదీకాకుండా ఐపీఎల్లో భాగస్వామి అయిన మొట్టమొదట సౌత్ ఇండియా హీరోగా కూడా రికార్డు క్రియేట్ చేస్తాడు మోహన్లాల్.