ఆ టీమ్ కోచ్తో మైదానంలో గొడవ పడిన విరాట్ కోహ్లీ... ఆలస్యంగా వెలుగులోకి...
IPL 2020 సీజన్లో ఓ కొత్త విరాట్ కోహ్లీని చూశారు క్రికెట్ ఫ్యాన్స్. మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలో పిచ్చి పిచ్చిగా క్రేజీ డ్యాన్సులు వేసిన విరాట్ కోహ్లీ... మ్యాచ్ సందర్భంలో సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే వంటి యంగ్ స్వదేశీ క్రికెటర్లపై కూడా సెడ్జింగ్ చేసి ట్రోల్స్కి గురయ్యాడు. తాజాగా విరాట్ ఫ్యాన్స్ను ఇబ్బంది పెట్టే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఎప్పుడూ లేనంత ఉత్కంఠభరితంగా సాగిన 2020 సీజన్లో ఆఖరి గ్రూప్ మ్యాచ్ దాకా ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కాని సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజీలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్కి ముందు ప్లేఆఫ్ బెర్తులు కన్ఫార్మ్ చేసుకున్నాయి ఆర్సీబీ, ఢిల్లీ.
13 మ్యాచుల్లో ఏడేసి విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకి ఆఖరి గ్రూప్ మ్యాచ్ ఫలితం కీలకంగా మారింది. గెలిచిన జట్టు ప్లేఆఫ్ చేరితే, ఓడిన జట్టుకి ప్లేఆఫ్ బెర్తు కోసం రన్రేట్ నిర్ణయించబడుతుంది.
దీంతో విజయం కోసం ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఢిల్లీ బౌలింగ్ రాణించడంతో బ్యాటింగ్లో ఫెయిల్ అయిన విరాట్ సేన... నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ కీలక మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేసి, ఆ జట్టుకి ఊహించని షాక్ ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. దాదాపు నాలుగు సీజన్ల తర్వాత కోహ్లీని అశ్విన్ అవుట్ చేశాడు.
ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. కారణం రవిచంద్రన్ అశ్విన్. ఈ విషయాన్ని స్వయంగా యూట్యూబ్ ద్వారా ప్రకటించాడు రవిచంద్రన్ అశ్విన్.
‘నా బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసిన తర్వాత నేను ఫీల్డింగ్ చేయలేకపోయాను. భయంకరమైన వెన్నునొప్పి రావడంతో మైదానాన్ని వీడాను. అయితే దీనికి ఆర్సీబీ అభ్యంతరం చెప్పింది. బౌలింగ్ అయిపోగానే రెస్టు తీసుకుంటున్నానని భావించి అభ్యంతరం వ్యక్తం చేసింది...’ అంటూ తెలిపాడు ఢిల్లీ స్పిన్నర్ అశ్విన్.
స్ట్రాటెజిక్ టైమ్ సమయంలో విరాట్ కోహ్లీ ఈ విషయంలో అభ్యంతరం లేవనెత్తారు. ఇదే సమయంలో ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్, మైదానంలోకి వచ్చి విరాట్ కోహ్లీ సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు.
అయితే కోహ్లీ వినిపించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి అశ్విన్ వెన్నునొప్పితో బాధపడడం వల్లే ఫీల్డింగ్కి రాలేదని తెలిసి శాంతించాడట విరాట్ కోహ్లీ.
స్ట్రాటెజిక్ టైమ్లో ఈ వాగ్వాదం అంతా జరగడంతో విషయం వెలుగులోకి రాలేదు. అయితే యూట్యూబ్లో వీడియో ద్వారా విషయాన్ని బయటపెట్టాడు రవిచంద్రన్ అశ్విన్.
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రెండో మ్యాచ్లో ఓడినా మెరుగైన రన్రేట్ కారణంగా ప్లేఆఫ్కి అర్హత సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే మొదటి ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి నాలుగో స్థానానికే పరిమితమైంది ఆర్సీబీ.