IPL 2020 Final: టైటిల్ గెలిచిన జట్టుకి ఎంత ప్రైజ్మనీ దక్కుతుందంటే... పారితోషికంపై కరోనా ఎఫెక్ట్...
IPL 2020 సీజన్ మెగా సమరానికి నేటితో తెరపడనుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే ఫైనల్ ఫైట్లో ఏ జట్టు గెలుస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్పైనే చాలామంది భరోసాగా ఉన్నా, యంగ్ ఢిల్లీ సంచలనం చేస్తుందని నమ్ముతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
కరోనా టైమ్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ను విజయవంతంగా నిర్వహించింది బీసీసీఐ.
56 రోజుల పాటు సాగిన ఈ బెస్ట్ థ్రిల్లింగ్ సీజన్లో గ్రూప్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్ వరకూ ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కాలేదు...
ఐపీఎల్లో అద్భుత రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ 2020 సీజన్లో ఊహించని నిరాశజనిత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితం కావడం ఎవ్వరూ ఊహించని పరిణామం.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్గా నిలిచిన జట్టుకి టోర్నీతో పాటు భారీ మొత్తంలో ప్రైజ్మనీ కూడా దక్కబోతోంది.
కరోనా పరిస్థితుల కారణంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించడం వల్ల గత సీజన్తో పోలిస్తే ప్రైజ్మనీలో 50 శాతం కోత విధించింది బీసీసీఐ.
గత ఏడాది ఐపీఎల్ ప్లేఆఫ్ చేరిన జట్లకి ఇచ్చే మొత్తం పారితోషకం 32. 5 కోట్ల రూపాయలు ఉండగా, ఈ సీజన్లో దాన్ని రూ. 25 కోట్లకే పరిమితం చేసింది బీసీసీఐ.
ఐపీఎల్ 2020 టైటిల్ను గెలిచిన జట్టుకి పారితోషికంగా రూ.20 కోట్ల రూపాయలు దక్కుతాయి. ఫైనల్ మ్యాచ్లో ఓడి రన్నరప్గా నిలిచిన జట్టుకి రూ.12 కోట్ల 50 లక్షలు ప్రైజ్మనీగా దక్కుతాయి.
ప్లేఆఫ్కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్కి రూ. 4.375 కోట్లు పారితోషికంగా దక్కనుంది.
నిజానికి ఐపీఎల్లో ఆడిన ప్రతీ జట్టుకి ఎంతో కొంత పారితోషికం దక్కేది. గ్రూప్ స్టేజ్కే పరిమితమైన జట్లకి కూడా రూ.4 కోట్ల దాకా పారితోషికం ఇచ్చేవాళ్లు. అయితే కరోనా ఎఫెక్ట్తో దాన్ని కాస్తా కట్ చేశారు.
అధికారికంగా ప్రకటించకపోయినా భారతదేశానికి దూరంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించడం వల్ల దాదాపు 30 శాతం ఆదాయాన్ని కోల్పోయింది భారత క్రికెట్ బోర్డు.
అయితే స్పాన్సర్షిప్, బ్రాడ్కాస్టింగ్ తదితర మార్గాల ద్వారా బీసీసీఐకి ఈ ఐపీఎల్ ద్వారా రూ. 222 కోట్ల ఆదాయం సమకూరినట్టు సమాచారం.