IPL 2020 Final: ముంబై ఫ్యాన్స్ని భయపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్... రెండుసార్లు అలా...
IPL 2020 ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడితే, అది విచిత్రమే. ఎందుకంటే నాలుగుసార్లు టైటిల్ ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్, ఈ సీజన్లో భీకరమైన ఫామ్లో ఉంది. సీజన్లో ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప ఓడిన మ్యాచుల్లో కూడా అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది ముంబై ఇండియన్స. అయితే ముంబై ఫ్యాన్స్ను ఓ సెంటిమెంట్ భయపెడుతోంది.
13 సీజన్లుగా టైటిల్ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ప్రతీ సీజన్ తర్వాత జట్టులో చాలా రకాల మార్పులు చేస్తూ వచ్చింది. ఇవి ప్రత్యర్థి జట్లకి కలిసొచ్చాయి.
భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన ఆసీస్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో 2017లో షేన్ వాట్సన్ను రిలీజ్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఆ తర్వాతి ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన షేన్ వాట్సన్... 2018లో సీఎస్కేని ఫైనల్ చేర్చి, మూడో టైటిల్ అందించాడు.
దక్షిణాఫ్రికా ప్లేయర్ డి కాక్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడిన ఆటగాడే. అయితే పెద్దగా ప్రదర్శన కనబరచకపోవడంతో 2018లో డి కాక్ను రిలీజ్ చేసింది రాయల్ ఛాలెంజర్స్.
2019లో ముంబై ఇండియన్స్లో చేరిన డి కాక్... మంచి పర్ఫామెన్స్తో ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్ కూడా గెలిచిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అదరగొడుతున్న ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడే కావడం ముంబై ఫ్యాన్స్ని కలవరబెడుతోంది.
ఢిల్లీ ఫైనల్ చేరడానికి స్టోయినిస్ పర్ఫామెన్స్ కూడా చాలా ఉపయోగపడింది. హెట్మయర్ కూడా ఆర్సీబీ నుంచి వచ్చినవాడే. ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కప్పు గెలవాలి.
అయితే ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి బయటికి వచ్చిన క్రిస్ గేల్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి అందించేవాడని అంటున్నారు కొందరు అభిమానులు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి బయటికి వచ్చిన ప్లేయర్లలో స్టీవ్ స్మిత్, ఇయాన్ మోర్గాన్ వంటి ఎందరో ప్లేయర్లు టైటిల్ గెలవలేకపోయారని గుర్తుచేస్తున్నారు.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కోచ్గా ఉన్న జయవర్థనే, 2013లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆడాడు. మరోవైపు 2013లో ముంబై తరుపున ఆడిన రికీ పాంటింగ్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి కోచ్గా వ్యవహారించబోతున్నాడు.