INDvsENG 2nd Test: ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకున్న బుమ్రా, షమీ...
ఇంగ్లాండ్ టూర్లో టీమిండియాకి ఏది కలిసొచ్చినా, రాకపోయినా భారత టెయిలెండర్ల ఆటతీరు మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆరో వికెట్ పడితే చాలు, పేకమేడలా కూలిపోయే టీమిండియా...లార్డ్స్లో జరుగుతున్న రెండో టెస్టులో అంచనాలకు మించి రాణిస్తూ అదరకొట్టింది. లంచ్ బ్రేక్ సమయానికి 108 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది టీమిండియా...

లార్డ్స్ టెస్టులో ఆఖరి రోజు రసవత్తరంగా మొదలైంది. ఓవర్నైట్ స్కోర్ 181/6 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయింది...
ఆ తర్వాత 24 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఇషాంత్ శర్మ కూడా ఓల్లీ రాబిన్సన్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను టార్గెట్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లు బౌన్సర్లు సంధించడం మొదలెట్టారు. ఈ సమయంలో మార్క్ వుడ్, బుమ్రా మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ఇద్దరినీ అడ్డుకునేందుకు ఫీల్డ్ అంపైర్ ప్రయత్నించారు.
అంపైర్కి బుమ్రా ఏదో చెప్పడం, జోస్ బట్లర్ కలిపించుకుని ఏదో కామెంట్ చేయడం జరిగిపోయాయి. ఈ సంఘటన తర్వాత మార్క్ వుడ్ వేసిన ఓ బంతి వేగంగా వచ్చి బుమ్రా హెల్మెట్కి తగిలింది.
తొలి ఇన్నింగ్స్లో జేమ్స్ అండర్సన్ పైకి బౌన్సర్లు వేసిన బుమ్రాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు అందరూ అతన్ని టార్గెట్ చేయడంపై భారత సారథి విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది.
ఈ సంఘటన తర్వాత కసిగా క్రీజులో నిలదొక్కుకుపోయిన జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీతో కలిసి 9వ వికెట్కి అజేయంగా 77 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 2002 ట్రెంట్బ్జిడ్జ్ టెస్టులో హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తర్వాత ఇంగ్లాండ్లో టీమిండియాకి 9వ వికెట్కి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం రావడం ఇదే తొలిసారి...
లార్డ్స్ టెస్టులో 39 ఏళ్ల తర్వాత 9వ వికెట్కి భారత్ నుంచి 50+ భాగస్వామ్యం వచ్చింది. 1952లో రామ్, షిండే 9వ వికెట్కి 50+ భాగస్వామ్యం నెలకొల్పగా, ఆ తర్వాత 1982లో కపిల్దేవ్, మదన్లాల్ కలిసి ఈ ఫీట్ సాధించారు...
మొయిన్ ఆలీ బౌలింగ్లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు మహ్మద్ షమీ... 57 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన షమీ... 1932లో అమర్సింగ్, 2014లో భువనేశ్వర్ కుమార్ తర్వాత 9వ స్థానంలో లార్డ్స్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు..
రిషబ్ పంత్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయి, త్వరగా ఆలౌట్ అవుతుందనుకున్న టీమిండియా... బుమ్రా, షమీ కారణంగా రెండు వికెట్లు చేతిలో ఉంచుకుని భారీ ఆధిక్యంతో లంచ్కి వెళ్లింది.
ప్రస్తుతం టీమిండియాకి 259 పరుగుల ఆధిక్యం ఉంది. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది...
మహ్మద్ షమీ 67 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 52 పరుగులు... జస్ప్రిత్ బుమ్రా 58 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.