టీమిండియాకి ఊహించని షాక్... ఇంగ్లాండ్ టూర్లో భారత క్రికెటర్కి కరోనా పాజిటివ్...
ఇంగ్లాండ్ టూర్ ఆరంభానికి ముందు భారత జట్టుకి ఊహించని షాక్ తగిలింది. బయో బబుల్లోకి వచ్చిన భారత క్రికెటర్లకు జరిపిన కరోనా పరీక్షలలో ఓ ప్లేయర్కి పాజిటివ్గా తేలింది. వెంటనే సదరు క్రికెటర్కి ఐసోలేషన్కి తరలించారు...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లకు 20 రోజుల హాలీడేస్ ఇచ్చింది బీసీసీఐ. దీంతో ఫ్యామిలీల సహా ఇంగ్లాండ్ టూర్కి వెళ్లిన భారత క్రికెటర్లు, ఇంగ్లాండ్లో విహారయాత్రలు చేశారు...
తాజాగా ఓ భారత ప్లేయర్కి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. అయితే ఆ ప్లేయర్ ఎవరనేది మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. కరోనా పాజిటివ్ రావడంతో ఇంగ్లాండ్లోని తన బంధువుల ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉన్న సదరు క్రికెటర్ను టీమ్ ఐసోలేషన్ సెంటర్కి తరలించారు.
హాలీడేస్ ఎంజాయ్ చేసిన భారత క్రికెటర్లు, గురువారం తిరిగి బయో బబుల్లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ. ఇప్పటికే రెండు డోస్ల కరోనా వ్యాక్సిన్ కోర్సును పూర్తి చేసుకున్న భారత క్రికెటర్లు, కౌంటీ టీమ్తో ప్రాక్టీస్ మ్యాచ్కి ముందు మరోసారి కరోనా పరీక్షలు చేయించనున్నారు...
పాజిటివ్గా తేలిన క్రికెటర్ను కలిసిన భారత ప్లేయర్లను, సహాయక సిబ్బంది కూడా మూడు రోజుల పాటు క్వారంటైన్లో గడపబోతున్నారు...
శ్రీలంకతో సిరీస్ ముగించుకున్న తర్వాత ఇంగ్లాండ్ జట్టులోని ఏడుగురు కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. అలాగే శ్రీలంక బ్యాటింగ్ కోచ్, సహాయక సిబ్బందితో పాటు మరో లంక క్రికెటర్కి పాజిటివ్ వచ్చింది...
‘ఇంగ్లాండ్ జట్టు దాదాపు 14 నెలలుగా కఠినమైన బయో బబుల్లో గడుపుతోంది. పక్కా పకడ్బందీగా ప్రొటోకాల్స్ను అనుసరిస్తున్నాం. అయితే కరోనా ఎలా వచ్చిందో తెలీదు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు సోకిన వైరస్ డెల్టా వేరియెంట్గా గుర్తించాం...’ అంటూ కామెంట్ చేశారు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈవో టామ్ హారీసన్.
ఇంగ్లాండ్ టూర్లో భారత క్రికెటర్కి కూడా పాజిటివ్ రావడంతో ఇంగ్లాండ్, శ్రీలంకలతో పాటు ఆ రెండు జట్లతో సిరీస్ ఆడబోతున్న భారత జట్టును కూడా కరోనా తాకినట్టు అయ్యింది.