Virat Kohli: జాగ్రత్త.. కోహ్లీ ఫామ్లోకి వస్తే మీకు తిప్పలు తప్పవు.. పాక్ను హెచ్చరించిన మాజీ సారథి
Asia Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఆసియా కప్ తో తిరిగి ఫామ్ ను అందుకుంటాడని భావిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ కంటే ముందే దాయాది దేశాల మధ్య పోరు కోసం ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్-2022లో భాగంగా ఇరు దేశాల మధ్య ఈనెల 28న మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు పాకిస్తాన్ తో పోల్చితే బలంగా కనిపిస్తన్నదని.. ఒకవేళ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వస్తే అప్పుడు పాక్ కు కష్టాలు తప్పవని అంటున్నాడు ఆ జట్టు మాజీ సారథి సల్మాన్ భట్. తాజాగా అతడు తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Salman Butt
భట్ స్పందిస్తూ.. ‘భారత జట్టులో రొటేషన్ పాలసీ ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. ప్రతీ సిరీస్ లో వాళ్లు వేర్వేరు ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నారు. ప్రతీ సిరీస్ లో బెంచ్ ను, కాంబినేషన్స్ ను మార్చుతూ జట్టును మరింత స్ట్రాంగ్ గా మార్చుకుంటున్నారు.
Image credit: Getty
ప్రస్తుతానికి వాళ్లకు టీమ్ సెలక్షన్ ఒక తలనొప్పిలా మారినా అది జట్టు మంచికే. సీనియర్లు, యువ ఆటగాళ్లకు అవకాశాలనిస్తూ జట్టును బలంగా తయారుచేసుకుంటున్నారు.
ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే.. అతడి అనుభవం, శక్తి సామార్థ్యాలేమిటో మనందరికీ తెలుసు. గత కొంతకాలంగా ఫామ్ లో లేని కోహ్లీ తిరిగి పామ్ ను అందుకోవాలని టీమిండియా భావిస్తున్నది. ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో మ్యాచ్ లోనే విరాట్ ఫామ్ లోకి వస్తే అది పాక్ కు కష్టమే..
Image credit: Getty
ఒక్కసారి కోహ్లీ తన పూర్వపు ఫామ్ ను అందుకున్నాడంటే ఇక అతడిని ఆపడం ఎవరితరమూ కాదు. కచ్చితంగా పాకిస్తాన్ కు తలనొప్పిగా మారతాడు..’ అని భట్ చెప్పాడు.
గతేడాది దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత జట్టు పాకిస్తాన్ తో మ్యాచ్ లో దారుణంగా విఫలమైంది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. కానీ కోహ్లీ మాత్రం.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.