ఓడితే విరాట్ కెప్టెన్సీని తిడతారు, గెలిస్తే కేన్ విలియంసన్పై సానుభూతి చూపిస్తారు... ఎలాచూసినా కోహ్లీకి...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం న్యూజిలాండ్, ఇండియా జట్లు దాదాపు రెండు నెలలుగా సిద్ధమవుతున్నాయి. తన కెరీర్లో మొట్టమొదటి ఐసీసీ టైటిల్ గెలవాలని కింగ్ కోహ్లీ ఎన్నో ఆశలతో ఈ ఫైనల్ మ్యాచ్కి సిద్ధమవుతుంటే, కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు.
ఇంగ్లాండ్లో సౌంతిప్టన్లో గల రోజ్ బౌల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవడం టీమిండియాకి అంత తేలికైన విషయం కాదు. ముందే ఇంగ్లాండ్లో భారత బ్యాట్స్మెన్కి చెప్పుకోదగ్గ రికార్డు కూడా లేదు...
2014లో చివరిసారిగా ఇంగ్లాండ్లో టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా, అక్కడ మొదటి మ్యాచ్ గెలిచినా ఆ తర్వాత వరుసగా మూడు టెస్టుల్లోనూ చిత్తుగా ఓడింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ పిచ్పై ఘోరంగా విఫలమయ్యాడు. కోహ్లీ కెరీర్లోనే దారుణమైన ప్రదర్శన కనబర్చిన సిరీస్ ఇదే...
ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్ ఫ్యాన్స్ని ఆందోళన కలిగిస్తోంది. చివరిసారిగా 2019లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, 2020లో ఒక్క శతకం కూడా కొట్టలేకపోయాడు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లోనూ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు...
రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఛతేశ్వర్ పూజారా వంటి టాప్ క్లాస్ ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ... ఇంగ్లాండ్ వాతావరణం, పిచ్లను పరిగణనలోకి తీసుకుంటే టీమిండియా గెలుపు కంటే కూడా న్యూజిలాండ్ విజయానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిఫ్ ఫైనల్లో టీమిండియా ఓడిపోతే, మరోసారి విరాట్ కోహ్లీ ట్రోలింగ్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 8 సీజన్లుగా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయినా, తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయాడు.
విదేశాల్లో, స్వదేశాల్లో అద్భుత విజయాలు అందుకుంటూ టాప్ టీమ్గా కొనసాగుతున్నప్పటికీ, ఐసీసీ టోర్నీల్లో విఫలం కావడం కోహ్లీపై విమర్శలు రావడానికి కారణమైంది. ఫైనల్లో ఓడితే, విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని మళ్లీ డిమాండ్లు వినిపించడం ఖాయం.
గత 15 ఏళ్లల్లో ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్పై విజయం సాధించలేకపోయింది టీమిండియా. ఈ రికార్డు కూడా భారత జట్టు అభిమానులను కలవరపెట్టే అంశమే. 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్లో కూడా టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లోనే ఓడింది...
అయితే గత 15 ఏళ్లల్లో ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది న్యూజిలాండ్. 2019 వన్డే వరల్డ్కప్లో ఫైనల్ చేరినప్పటికీ, తుదిపోరులో స్కోర్లు సమం కావడం, సూపర్ ఓవర్ కూడా టై కావడంతో బౌండరీల లెక్కన ఇంగ్లాండ్కి టైటిల్ దక్కిన విషయం తెలిసిందే.
అయితే న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చరిత్రలో సాధించిన ఒకే ఒక్క ఐసీసీ టైటిల్ 2000లో గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ టోర్నీలో టీమిండియాపైనే విజయం సాధించి టైటిల్ గెలిచింది కివీస్. ఇప్పుడు మరోసారి భారత్పైనే ఫైనల్ ఆడనుంది.
ఒకవేళ భారత జట్టు ఫైనల్లో అద్భుత ఆటతీరుతో విజయం సాధించి, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ సాధించినా... గెలిపించిన కోహ్లీకి దక్కే క్రెడిట్ కంటే, ఓడిన జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్పైనే ఎక్కువ సానుభూతి చూపిస్తారు టీమిండియా ఫ్యాన్స్...
కేన్ విలియంసన్కి ఇక్కడ పాజిటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండగా, భారత సారథి విరాట్ కోహ్లీని రోహిత్ ఫ్యాన్స్తో పాటు ధోనీ ఫ్యాన్స్, సచిన్ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఇష్టపడకపోవడం దీనికి ప్రధాన కారణం.