ICC WTC Final: తొలి సెషన్ వరుణుడికే... వర్షం కారణంగా టాస్ ఆలస్యం...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్కి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. వర్షం కారణంగా సౌంతిప్టన్లో జరుగుతున్న ఫైనల్ తొలి రోజు తొలి సెషన్ రద్దు చేశారు...
రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మైదానమంతా చిత్తడిగా మారింది. అయితే గ్రౌండ్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక సదుపాయాల కారణంగా పిచ్ను వెంటనే రెఢీ చేయొచ్చని భావించారు....
అయితే మ్యాచ్ సమయానికి కూడా వర్షం ఆగకపోవడంతో తొలి సెషన్ను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మ్యాచ్ రిఫరీలు. దీంతో లంచ్ ముగిసిన తర్వాత నేరుగా 5 గంటల సమయంలో టాస్ వేసే అవకాశం ఉంది...
అయితే ఇప్పటికీ వర్షం ఆగకపోవడం, ఆకాశం మబ్బులతో నిండి ఉండడంతో రెండో సెషన్లో అయినా ఆట సాధ్యమవుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది...
144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటిదాకా దాదాపు 2224 టెస్టుల మ్యాచులు జరిగాయి. ఐసీసీ నిర్వహిస్తున్న మొట్టమొదటి టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ విజేతను నిర్ణయించే మ్యాచ్కి ఇలా వర్షం కారణంగా అంతరాయం ఏర్పడడం విశేషం.
ఐదు రోజుల్లో మ్యాచ్ ఫలితం తేలకపోతే రిజర్వు డేగా ఆరో రోజును కూడా కేటాయించింది ఐసీసీ. అంటే నాలుగు రోజుల్లో వర్షం కారణంగా ఆడలేకపోయిన ఓవర్లను ఆరో రోజు జూన్ 23న ఆడతారు.
మొదటి రోజుతో పాటు రెండో రోజు కూడా సౌంతిప్టన్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఆ తర్వాత వారం రోజుల పాటు చిరుజల్లులు కురిస్తుందని తెలియచేసింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అని అనుమానిస్తున్నారు అభిమానులు.