ఓ ప్లానూ లేదు, ఓ పద్ధతి లేదు! రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైరే లేదు... పార్థివ్ పటేల్ షాకింగ్ కామెంట్...
ఐపీఎల్లో కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయ్యాడు రోహిత్ శర్మ. 8 సీజన్ల గ్యాప్లో ఐదు సార్లు టైటిల్ ఛాంపియన్గా నిలిచిన రోహిత్ శర్మ, ఐపీఎల్ ట్రాక్ రికార్డు కారణంగానే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు. అయితే భారత జట్టు సారథిగా రోహిత్ నుంచి ఇప్పటిదాకా ‘ఆహా..’ అనిపించే ఒక్క విజయం దక్కలేదు..
స్వదేశంలో ద్వైపాక్షిక సిరీసుల్లో దుమ్ముదులపడం తప్ప విదేశాల్లో జరిగిన ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో చిత్తుగా ఓడిన టీమిండియా, బంగ్లాదేశ్ పర్యటనలోనూ వన్డే సిరీస్ కోల్పోయింది...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి రెండు రోజుల్లో టీమిండియా పూర్తిగా తేలిపోయింది..
ఉస్మాన్ ఖవాజా త్వరగా అవుట్ అయినా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ కలిసి ఆస్ట్రేలియాకి తొలి ఇన్నింగ్స్లో 469 పరుగుల భారీ స్కోరు అందించారు. ఇదే పిచ్పై భారత టాపార్డర్ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు..
‘టీమిండియా ఎలాంటి ప్లాన్స్ లేకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి వచ్చినట్టుంది. టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ, ఆసీస్ బ్యాటర్లు వాళ్లంతట వాళ్లే అవుట్ అవుతారని ఎదురుచూస్తున్నట్టు కనిపించాడు..
Rohit Sharma
విదేశాల్లో టెస్టు మ్యాచులు గెలవాలంటే అటాకింగ్ ఫీల్డింగ్, అటాకింగ్ బౌలింగ్ మార్పులు చేయాలి. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఫైర్ కనిపించలేదు.
తొలి సెషన్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ బాగా అలిసిపోయినట్టు కనిపించాడు.. అదే టీమ్ యాటిట్యూడ్లోనూ కనిపించింది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్..