స్వింగ్ క్వీన్ రేణుకా ఠాకూర్పై ప్రధాని మోడీ ప్రశంసలు.. ఎంతోమందికి స్పూర్తి అంటూ కితాబు
Renuka Singh Thakur: ఇటీవలే జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ముగిసిన క్రికెట్ పోటీలలో భారత మహిళల జట్టు యువ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు.
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా నిర్వహించిన క్రికెట్ పోటీలలో ఫైనల్ లో ఆసీస్ చేతిలో ఓడిన భారత జట్టు రజత పతకం గెలిచింది. 24 సంవత్సరాల తర్వాత కామన్వెల్త్ లో ప్రవేశపెట్టిన క్రికెట్ పోటీలలో భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించింది. భారత్ రజతం సాధించడంలో యువ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కీలక పాత్ర పోషించింది.
గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన ఆమె అదే ప్రదర్శనను టోర్నీ మొత్తం కొనసాగించింది. ఈ టోర్నీలో రేణుకా 5 మ్యాచులలో 11 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచింది.
కామన్వెల్త్ లో ఛాంపియన్లుగా నిలిచిన భారత క్రీడాకారులతో శనివారం ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ.. రేణుకా ఠాకూర్ పై ప్రశంసలు కురిపించారు. ఆమె సాధించింది తక్కువేమీ కాదని కొనియాడారు. ధర్మశాలకు 300 కిలోమీటర్ల ఆవల ఉండే ప్రాంతం నుంచి వచ్చిన ఆమె చాలా మందికి స్పూర్తిగా నిలిచిందని చెప్పారు.
మోడీ మాట్లాడుతూ.. ‘ఈ క్రీడలలో ఆటగాళ్లందరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా క్రికెట్ లో రేణుకా సింగ్ ఠాకూర్ స్వింగ్ తో రాణించింది. ఆమె స్వింగ్ కు బ్యాటర్ల దగ్గర సమాధానం లేదు. కామన్వెల్త్ గేమ్స్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అంటే మాములు విషయం కాదు. ఆమె ముఖం షిమ్లా ప్రశాంతతకు చిహ్నం. రేణుకా నవ్వు పర్వాతాల చిరునవ్వును కలిగిఉంది.
చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తున్నా ఆటలో ఆమె దూకుడుకు మాత్రం అగ్రశ్రేణి బ్యాటర్ల దగ్గర కూడా సమాధానం లేదు. ఇటువంటి ప్రదర్శన కచ్చితంగా సుదూర ప్రాంతాల నుంచి అమ్మాయిలను పెద్ద పెద్ద కలలు కనేలా చేస్తుంది’ అని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రేణుకా తండ్రి చిన్నప్పుడే చనిపోగా ఆమె తల్లి అన్నీ అయి పెంచింది. తాజాగా మోడీ.. రేణుకాపై ప్రశంసలు కురిపించడంతో ఆమె తల్లి ఆనందానికి అవధుల్లేవు.
ఆమె స్పందిస్తూ.. ‘రేణుక ఇప్పుడు ఏం సాధిస్తున్నా అది ఆమె కఠోర శ్రమ వల్లే. నా భర్త రేణుకా చిన్న వయసులోనే చనిపోయాడు. కానీ నా కొడుకు, కూతురుకు ఆ లోటు లేకుండా పెంచాను. ఇవాళ ప్రధాని నా కూతురుపై ప్రశంసలు కురిపిస్తుంటే చాలా గర్వంగా ఉంది..’ అని ఆ తల్లి హర్షం వ్యక్తం చేసింది.