- Home
- Sports
- Cricket
- బుడగకు సెలవు.. టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఇక మరింత స్వేచ్ఛగా..
బుడగకు సెలవు.. టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఇక మరింత స్వేచ్ఛగా..
No Bio Bubble For Team India: కరోనా మహమ్మారి పుణ్యమా అని బయో బబుల్స్ లో చిక్కుకుని మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతూ లోలోపల కుమిలిపోతున్న టీమిండియా క్రికెటర్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది.

సుమారు రెండున్నరేండ్లుగా బుడగ (బయో బబుల్) లో గడుపుతున్న భారత క్రికెటర్లు ఇక గతంలో మాదిరిగా స్వేచ్ఛ గా గడిపే టైం వచ్చింది. బబుల్స్ తో ఒత్తిడికి గురవుతూ పలు టోర్నీలకు తప్పుకునే పద్ధతికి బీసీసీఐ మంగళం పాడనున్నది. ఈ మేరకు బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
బయో బబుల్ విధానాన్ని ఐపీఎల్ - 2022 తో ముగిస్తున్నామని ఇకనుంచి బుడగలు ఉండబోవని సాక్షాత్తు బీసీసీఐ ప్రకటించింది. త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ (జూన్ 9 నుంచి)లో బయో బబుల్ లేకుండానే మ్యాచులను నిర్వహిస్తామని తెలిపింది.
ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. ‘బయో బబుల్ కథ ముగిసినట్టే. ఐపీఎల్-2022 తో ఆ విధానానికి స్వస్తి చెప్పనున్నాం. త్వరలో జరుగబోయే ఇండియా - దక్షిణాఫ్రికా సిరీస్ ను బబుల్ లేకుండానే నిర్వహించాలనుకుంటున్నాం.
అయితే బబుల్ లేకున్నా కోవిడ్ టెస్టులు మాత్రం తప్పకుండా నిర్వహిస్తాం..’ అని షా తెలిపారు. కరోనా నేపథ్యంలో 2020 నుంచి టీమిండియా సిరీస్ లన్నీ బయో బబుల్ లోనే జరుగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం.. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా నిబంధనలను తొలగించడంతో బీసీసీఐ కూడా ఈ నిర్ణయం తీసుకుంది.
గతేడాది కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కూడా రంజీ, ఇతర టోర్నీల నిర్వహణ కష్టమైంది. కానీ ఇప్పట్నుంచి వాటిని కూడా బబుల్ వాతావరణం లేకుండానే సాధారణ పరిస్థితుల్లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది.
బయో బబుల్ లోని కఠిన నిబంధనల కారణంగా క్రికెటర్లు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తొలుత బబుల్ లోకి ఆటగాళ్లను తప్ప వారి కుటుంబాలను కూడా అనుమతించలేదు. ఫ్యామిలీలకు దూరంగా ఉండటం వల్ల ఆటగాళ్లు తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కున్నారు.
టీమిండియా టీ 20 ప్రపంచకప్ -2022 ఓటమికి కూడా తీరిక లేని క్రికెట్ తో పాటు బయో బబుల్ వాతావరణం కూడా ఓ ప్రధాన కారణమని జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇదే విషయమై జై షా మాట్లాడుతూ.. ‘అవును.. ఇది (బబుల్) ఆటగాళ్లకు చాలా కఠినమైనది. అయితే ఐపీఎల్-2022 లో మాత్రం ప్రతి జట్టుకు ఒక హోటల్, లోపల వారికోసం ప్రత్యేకమైన రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఒక ఫ్యామిలీ వాతావరణం కల్పించడం వల్ల టోర్నీ సజావుగా సాగింది’ అని తెలిపాడు.
ఐపీఎల్-15ను విజయవంతంగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషించిన మహారాష్ట్ర, ముంబై క్రికెట్ అసోసియేషన్లకు జై షా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.