INDvsENG: మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... కీలకంగా మూడో రోజు ఆట...
లార్డ్స్ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 364 పరుగులకి ఆలౌట్ కాగా... ఇంగ్లాండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 245 పరుగులు వెనకబడి ఉంది ఇంగ్లాండ్...
44 బంతుల్లో ఓ ఫోర్తో 11 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీని, టీ బ్రేక్ విరామం తర్వాత వేసిన రెండో బంతికే అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్... టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు.
ఆ తర్వాతి బంతికే హసీమ్ హమీద్ను కూడా సిరాజ్ క్లీన్బౌల్డ్ చేయడంతో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...
అయితే సిరాజ్కి హ్యాట్రిక్ దక్కకుండా చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, రోరీ బర్న్స్తో కలిసి మూడో వికెట్కి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
136 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన రోరీ బర్న్స్... హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో షమీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
జో రూట్ 75 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు, జానీ బెయిర్ స్టో 17 బంతుల్లో 6 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. రెండో టెస్టులో టీమిండియా పట్టు సాధించాలంటే మూడో రోజు ఇంగ్లాండ్ సాధ్యమైనంత తక్కువ స్కోరుకి ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.