గాడితప్పుతున్నారు.. వెళ్లాల్సిన దిశ అయితే కాదు.. దీనికి బాధ్యులెవరు..? టీమిండియాపై మదన్ లాల్ ఫైర్
BANvsIND: బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు దారుణ వైఫల్యంతో రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా దేశానికి క్రికెట్ ఆడటం మరిచిపోయిందని.. జట్టు వెళ్లాల్సిన దిశలో వెళ్లడం లేదంటున్నాడు మదన్ లాల్.
బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ కోల్పోయిన టీమిండియాపై అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చెత్త ప్రదర్శనలతో దేశం పరువుతీస్తున్నారనే అభిమానుల ఆగ్రహానికి గొంతు కలుపుతూ జట్టు వెళ్లాల్సిన దిశలో వెళ్లడం లేదని భారత మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ మదన్ లాల్ అన్నాడు.
బంగ్లాతో సిరీస్ ఓడిన తర్వాత మదన్ లాల్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘టీమిండియా అయితే కచ్చితంగా వెళ్లాల్సిన దిశలో వెళ్లడం లేదన్నది వాస్తవం. జట్టులో మునపటి దూకుడు కనిపించడం లేదు. గత రెండేండ్లలో భారత జట్టులో కనిపించిన జోష్ ఇప్పుడు లేదు. మన క్రికెటర్లు దేశానికి ఆడుతున్నామనే విషయాన్ని మరిచిపోయినట్టున్నారు.
మన క్రికెటర్లలో గెలవాలన్న కసి కనిపించడం లేదు. ఏదో ఆడుతున్నామా అంటే ఆడుతున్నాం అన్నట్టుగా ఆడుతున్నారే తప్ప వందశాతం దేశం కోసం ఆడుతున్నామనే అభిప్రాయం ఏ ఒక్కరిలోనూ లేదు. సగం ఫిట్ గా ఉన్న ప్లేయర్స్ ఇండియాకు ఆడుతున్నారని రోహిత్ శర్మ అంటున్నాడు. మరి దీనికి బాధ్యులెవరు..?
ఫిట్ గా లేని ప్లేయర్లను ఎందుకు ఆడిపిస్తున్నారు..? అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారంటే ఫిట్ గా లేకుంటే ఎలా..? తీరికలేని సిరీస్ లు ఉంటే ఐపీఎల్ ఆడకండి. అప్పుడు విశ్రాంతి తీసుకోండి. దేశమే ముందు ప్రాధాన్యం. ఐసీసీ ట్రోఫీలు గెలవకుంటే దేశంలో క్రికెట్ తిరోగమనం దిశగా వెళ్తున్నట్టే...’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారత జట్టు టాపార్డర్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ, ధావన్, రాహుల్ వరుసగా విఫలమవుతుండటంపై మదన్ లాల్ తీవ్రంగా స్పందించాడు. టాపార్డర్ గెలవకుంటే జట్టు గెలవదని.. కుర్రాళ్లకు మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్లు వరుసగా విఫలమవుతుంటే ఎలా..? అని ప్రశ్నించాడు.
‘టాపార్డర్ బ్యాటర్లు జట్టుకు భారంగా మారారు. వీళ్లు గత మూడేండ్లలో ఎన్ని సెంచరీలు చేశారు..? వయసు మీద పడుతున్న కొద్దీ ఆట తగ్గిపోవడం సాధారణమే. కానీ వాళ్లు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. బాగా ఆడి జట్టుకు మార్గనిర్దేశనం చేయాల్సింది వాళ్లే. కానీ వాళ్లు చేసేదేంటి..? ప్రతీసారి వెళ్లడం, రావడం వల్ల జట్టుకు ఏం ప్రయోజనం..?. భారత బౌలింగ్ కూడా దారుణంగా ఉంది. బంగ్లాదేశ్ 69కే ఆరు వికెట్లు కోల్పోయి ఆ తర్వాత 271 రన్స్ చేసిందంటేనే మన బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..’అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.