ప్రాక్టీస్లో ధోనీ ధనాధన్... సీఎస్కే ఫ్యాన్స్ను వెంటాడుతున్న ఐపీఎల్ 2020 సెంటిమెంట్...
ఐపీఎల్ 2021 సీజన్ కోసం నెల రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలెట్టేశాయి కొన్ని ఫ్రాంఛైజీలు. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఆగస్టు 2 నుంచే ప్రాక్టీస్ మొదట్టేసింది. ఇప్పటికే యూఏఈ చేరుకున్న సీఎస్కే జట్టు, అక్కడి క్యాంపులో నెట్ ప్రాక్టీస్ చేస్తోంది...
ఐపీఎల్ 2021 సీజన్కి బ్రేక్ పడే సమయానికి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది...
దుబాయ్లో ఏర్పాటుచేసిన సీఎస్కే క్యాంపులో మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల మోత మోగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది సీఎస్కే...
ఈ వీడియో చూసి... మిగిలిన ఫ్రాంఛైజీలు జాగ్రత్తగా ఉండాలని, సీఎస్కే ప్రచారం చేయాలని భావించినా... చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మాత్రం రివర్స్లో ఐపీఎల్ 2020 సీన్ రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు...
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు కూడా ఇలా నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు పోస్టు చేసి, తెగ హడావుడి చేసింది సీఎస్కే...
ఆశించినట్టుగానే తొలి మ్యాచ్లో ముంబైపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సీఎస్కే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది. ఐదో మ్యాచ్లో పంజాబ్పై గెలిచినా... ఆ తర్వాత ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడి... ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది...
సురేష్ రైనా, వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందే అర్ధాంతరంగా తప్పుకోవడం, హార్భజన్ సింగ్ కూడా వెనక్కి వచ్చేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది చెన్నై సూపర్ కింగ్స్...
మొత్తంగా 14 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని, 8 మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్... పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ కెరీర్లో సీఎస్కే, ప్లేఆఫ్కి అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి...
సీజన్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్లో సిక్సర్లు బాదుతున్నట్టుగా వీడియోల్లో కనిపించిన మహేంద్ర సింగ్ ధోనీ, తీరా మ్యాచులు మొదలయ్యాక ఘోరంగా ఫెయిల్ అయ్యాడు...
అటు బ్యాట్స్మెన్, ఇటు కెప్టెన్గా దారుణమైన ప్రదర్శన ఇచ్చాడు. కొన్ని మ్యాచుల్లో అంపైర్లను బెదిరించడం వంటి సంఘటనలు కూడా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి...
ఈసారి కూడా మళ్లీ యూఏఈ వేదికగా మ్యాచులు జరుగుతుండడం... అప్పటిలాగే ఇప్పుడు కూడా ప్రాక్టీస్ వీడియోలతో సోషల్ మీడియాలో సీఎస్కే ప్రచారం చేస్తుండడంతో అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు ఆందోళనలకు గురవుతున్నారు.
ఆగస్టు 13నే దుబాయ్ చేరుకున్న సీఎస్కే స్టార్లు ధోనీ, సురేష్ రైనా, దీపక్ చాహార్, రాబిన్ ఊతప్ప... తదితర క్రికెటర్లు క్యాంపులో యమా బిజీగా ప్రాక్టీస్ చేస్తున్నారు...