క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ మృతి... క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస..
కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్...
ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస...
భారత క్రికెటర్ల కుటుంబాల్లో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న నటరాజన్, వేదాకృష్ణమూర్తి, నిన్న పియూష్ చావ్లా, ప్రియా పూనియా ఇంట్లో కరోనా వైరస్ విషాదం నింపగా... తాజాగా క్యాన్సర్ మహమ్మారి కారణంగా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ తుదిశ్వాస విడిచారు.
కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న కిరణ్ పాల్ సింగ్, గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కిరణ్ పాల్, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
భువీ తండ్రి వయసు 63 ఏళ్లు. పంజాబ్కి చెందిన కిరణ్ పాల్ సింగ్, మీరట్లో సెటిల్ అయ్యారు. అతి అరుదైన లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన, జాండీస్తో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్లు తెలిపారు.
ఐపీఎల్ 2021 సీజన్లో గాయపడి రెండు మ్యాచులకు దూరమైన భువనేశ్వర్ కుమార్, ఇంగ్లాండ్ టూర్కి ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఇంగ్లాండ్లో మంచి రికార్డు ఉన్న భువీని ఎంపిక చేయకపోవడంతో అతనికి టెస్టు ఆడడం ఇష్టలేనట్టుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తాను మూడు ఫార్మాట్లు ఆడేందుకు సిద్ధమంటూ ప్రకటించాడు భువనేశ్వర్ కుమార్.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లు ఇంగ్లాండ్ టూర్కి వెళ్లడంతో జూలైలో శ్రీలంకలో పర్యటించే యువ జట్టుకి భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది.
శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా కంటే భువీ కెప్టెన్ అయితే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ విషాదం నుంచి భువీ కోలుకుని, త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నారు అభిమానులు...