మళ్లీ అక్కడే ఐపీఎల్ 2021... సీజన్ సెకండాఫ్ మ్యాచులు పూర్తిచేయడం కోసం ఆ రెండు సిరీస్లు రద్దు...
ఎప్పుడు, ఎక్కడ, ఎలా... ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్ల విషయంలో నెలకొన్న సంగ్ధిదత ఇది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సెకండాఫ్పై బీసీసీఐ ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచులు నిర్వహిస్తారని వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం యూఏఈకే ఓటు వేసింది.
కరోనా సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఐపీఎల్ 2020 సీజన్ను నిర్వహించిన యూఈఏ వేదికగా 2021 సీజన్లో మిగిలిన మ్యాచులు జరుగుతాయి. దీని వల్ల బీసీసీఐకి ఖర్చు తక్కువ అవుతుంది, ఆదాయం భారీగా వస్తుంది.
ఇంగ్లాండ్ టూర్కి వెళ్తున్న టీమిండియా, సెప్టెంబర్ 14న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ను ముగించుకుంటుంది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ సెకండాఫ్ను యూఏఈ వేదికగా ప్రారంభించాలని చూస్తోంది బీసీసీఐ.
ఇందుకోసం రెండో, మూడో టెస్టు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఈసీబీని కోరినట్టు సమాచారం. రెండో టెస్టు ఆగస్టు 16న ముగిస్తే, మూడో టెస్టు 25న ప్రారంభం అవుతోంది. అంటే మధ్యలో 8 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను 4 రోజులకు తగ్గిస్తే, ఐదో టెస్టు 4 రోజులు ముందుగానే ముగుస్తుంది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 20 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ను ముగించాలని భావిస్తోంది భారత క్రికెట్ బోర్డు. ఇందులో 10 డబుల్ హెడెడ్ మ్యాచులు, 7 సింగిల్ డే మ్యాచులు, 4 ఫ్లేఆఫ్స్ ఉంటాయి.
సీజన్ను త్వరగా ముగించేందుకు సింగిల్ మ్యాచ్లను తగ్గించి, డబుల్ హెడెడ్ మ్యాచులను పెంచాలని భావిస్తోంది బీసీసీఐ. నేరుగా ఇంగ్లాండ్ బయో బబుల్ నుంచి ఐపీఎల్ బయో బబుల్లో చేరేలా యూఏఈ ప్రభుత్వాన్ని ఒప్పించాల్సి ఉంటుంది. లేదా ఆటగాళ్లు ఆరు రోజులు క్వారంటైన్లో గడపాల్సి ఉంటుంది.
షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది భారత జట్టు. అయితే ఐపీఎల్ సెకండాఫ్ను ముగించేందుకు ఈ రెండు సిరీస్లను రద్దు చేయాలని చూస్తోంది బీసీసీఐ.
ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత నేరుగా టీ20 వరల్డ్కప్కు వెళ్తుంది భారత జట్టు. భారత్ వేదికగా జరగాల్సిన 2021 టీ20 వరల్డ్కప్, కరోనా కేసుల నేపథ్యంలో ఇక్కడి నుంచి తటస్థ వేదిక అయిన యూఏఈకి తరలించడం దాదాపు ఖరారైంది.
దీంతో యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచులు నిర్వహిస్తే, టీ20 వరల్డ్కప్కి ముందు ఆటగాళ్లకు ప్రాక్టీస్గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.
అదీకాకుండా న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో సిరీస్లు రద్దు చేయడం వల్ల ఆ రెండు జట్ల ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించొచ్చు.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లు అందుబాటులో ఉంటారా? లేక టీ20 వరల్డ్కప్ ముందు ఐపీఎల్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.