- Home
- Sports
- Cricket
- IPL Media Rights: ఒక్కో మ్యాచ్ కు వంద కోట్లు దాటిన బిడ్డింగ్.. బీసీసీఐకి భారీగా ఆదాయం
IPL Media Rights: ఒక్కో మ్యాచ్ కు వంద కోట్లు దాటిన బిడ్డింగ్.. బీసీసీఐకి భారీగా ఆదాయం
IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీసీసీఐ పంట పండింది. రెండ్రోజుల వేలం ప్రక్రియలో భాగంగా ముంబై లో కొనసాగుతున్న ఇ-వేలంలో తొలి రోజు ముగిసింది.

బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తన్న ఐపీఎల్.. మీడియా హక్కుల ద్వారా భారత క్రికెట్ బోర్డును మరింత సంపన్నం చేయనున్నది. 2023-2027 కాలానికి గాను ముంబైలో జరుగుతున్న ఇ-వేలం ప్రక్రియ ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జించేందుకు సిద్ధమైంది.
రెండ్రోజుల వేలం ప్రక్రియలో భాగంగా ఆదివారం వేలం ముగిసేటప్పటికీ బిడ్ విలువ సుమారు రూ. 43,050 కోట్లకు చేరుకుంది. నాలుగు ప్యాకేజీలుగా విభజించిన ఈ ప్రక్రియలో తొలి రోజు ఎ (ఉపఖండంలో టీవీ హక్కులు), బి (డిజిటల్ హక్కులు) ప్యాకేజీలకు వేలం నిర్వహించింది.
ఎ ప్యాకేజీలో భాగంగా ఒక్కో మ్యాచ్ లో టీవీ హక్కుల కోసం ప్రారంభ ధరను రూ. 49 కోట్లు, డిజిటల్ హక్కులను రూ. 33 కోట్లుగా నిర్ణయిచింది. కాగా ‘ఎ’ ప్యాకేజీలో ఇప్పటికే రూ. 57 కోట్లు, ‘బి’ప్యాకేజీలో రూ. 48 కోట్ల దగ్గర నిలిచింది. తొలి రోజు వేలం ముగిసేనాటికి ఎ ప్యాకేజీ లో రూ. 23,370 కోట్లు.. బి ప్యాకేజీలో రూ. 19,700 కోట్ల వరకు బిడ్డింగ్ సాగింది. మొత్తంగా.. రూ. 43,050 కోట్ల వద్ద బిడ్డింగ్ నిలిచింది.
సోమవారం కూడా బిడ్డింగ్ కొనసాగనుంది. దీంతో బీసీసీఐ ముందుగా నిర్దేశించుకున్న రూ. 50 వేల కోట్ల టార్గెట్ అందుకోవడం పెద్ద విషయమేమీ కాదని తెలుస్తున్నది.
నాలుగు ప్యాకేజీలలో భాగంగా ఎ, బి సోమవారం కూడా కొనసాగనుండగా.. మిగిలిన ‘సి’ ప్యాకేజీ (ఐపీఎల్ ప్లేఆఫ్స్ తో పాటు ఇతర ప్రత్యేక మ్యాచుల హక్కులు), ‘డి’ ప్యాకేజీ (ఉపఖండం ఆవల) కి కూడా వేలం జరగాల్సి ఉంది.
వేలంలో ప్రస్తుతం.. డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీ పడుతున్నాయి. ఈ బడా బాబుల్లో ఏ సంస్థ తర్వాత ఐదేండ్ల కాలానికి ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకుంటుందో తెలియాలంటే సోమవారం సాయంత్రం దాకా ఆగాల్సిందే.