నువ్వు టీ20లకు పనికిరావు.. దిగిపో.. బాబర్ ఆజమ్పై పెరుగుతున్న అసంతృప్తి
టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా పుణ్యమా అని సెమీస్ చేరిన పాకిస్తాన్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదృష్టం కొద్దీ టీ20 ప్రపంచకప్ లో సెమీస్ కు చేరిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్ లో కివీస్ ను ఓడించింది. కానీ ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తై ఉత్త చేతులతోనే ఇంటికి తిరిగివెళ్లింది. ఈ మెగా టోర్నీలో ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్ లలో 134 పరుగులు మాత్రమే చేశాడు.
ఆటగాడిగా విఫలమైన బాబర్.. సారథిగా కూడా ఫెయిల్ అయ్యాడు. భారత్ తో మ్యాచ్ లో చివరి ఓవర్ మహ్మద్ నవాజ్ కు ఇవ్వడం.. ఫైనల్లో షాహీన్ షా అఫ్రిది గాయపడితే ఆ ఓవర్ ను ఇఫ్తికార్ కు ఇవ్వడం.. బ్యాటింగ్ ఆర్డర్ ను సరిగా చేసుకోకపోవడం వంటివి తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో బాబర్ పై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు.
తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ సారథి షాహీద్ అఫ్రిది కూడా స్పందించాడు. బాబర్ టీ20 సారథ్య పగ్గాలు వదులుకుంటేనే మంచిదని.. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో కూడా కెప్టెన్సీ పగ్గాలు వదులుకుంటేనే బెటరని వ్యాఖ్యానించాడు.
అఫ్రిది సామా టీవీతో మాట్లాడుతూ.. ‘బాబర్ ను నేను గౌరవిస్తాను. కానీ చాలాకాలంగా బాబర్ తన బ్యాటింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి సారథ్య పగ్గాలు చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. అందుకే బాబర్.. టీ20ల సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే మంచిది.
టీ20 కెప్టెన్సీని షాదాబ్ ఖాన్, మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్ వంటి ఆటగాళ్లకు అప్పజెప్పాలి. వాళ్లు కూడా జట్టును నడిపే సమర్థులు. బాబర్ జాతీయ టీ20 జట్టుతో పాటు పీఎస్ ఎల్ లో తాను ఆడుతున్న పెషావర్ జల్మీ సారథ్య పగ్గాలను విడిచిపెట్టాలి. తన ఆట మీద దృష్టిపెట్టాలి.
టెస్టులు, వన్డేల మీద దృష్టిసారించడానికి గాను బాబర్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మూడు ఫార్మాట్లలో ఒత్తిడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు.. జట్టు అవసరాల దృష్ట్యా బాబర్ టీ20లలో తన స్థానాన్ని త్యాగం చేయాలి..’అని అఫ్రిది తెలిపాడు.