అందుకే కోహ్లీకి మద్దతుగా నిలిచా : బాబర్ ఆజమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli: పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అండగా నిలిచిన విషయం తెలిసిందే.

గత కొన్నాళ్లుగా మునపటి ఫామ్ కోల్పోయి పరుగులు చేయడం అటుంచి కనీసం క్రీజులో నిలదొక్కుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్ పర్యటనలో అయినా కోహ్లి కుదురుకుంటాడమో అనుకుంటే అక్కడా విరాట్ కు ఎదురుదెబ్బలే తాకుతున్నాయి.
తాజాగా లార్డ్స్ వన్డేలో 16 పరుగులకే ఔటై తీవ్ర నిరాశపరిచిన తర్వాత అతడిపై విమర్శలు మరింత పెరిగాయి. కోహ్లీని విమర్శించేవారితో పాటు అతడికి మద్దతుగా నిలిచేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.
లార్డ్స్ వన్డే లో కోహ్లీ ఔటయ్యాక పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్.. ట్విటర్ లో ‘కష్టకాలం గడిచిపోతుంది. ధైర్యంగా ఉండు కోహ్లీ’ అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలాఉండగా ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పాకిస్తాన్ జట్టు అక్కడ శనివారం నుంచి మొదలుకాబోయే టెస్టు సిరీస్ కు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బాబర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎందుకు కోహ్లీకి అండగా నిలబడ్డానో చెప్పుకొచ్చాడు.
ఆజమ్ మాట్లాడుతూ.. ‘ఆధునిక క్రికెట్ లో కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఒక ఆటగాడిగా నేను కూడా ఆ దశ (ఫామ్ కోల్పోవడం) లోకి వెళ్తానని తెలుసు. కానీ మీరు ఆ దశలో ఉన్నప్పడు ఆటగాళ్లకు మద్దతునిస్తే వాళ్లు దాన్నుంచి త్వరగా బయటపడే అవకాశం వస్తుంది..’అని తెలిపాడు.
ఇక కోహ్లీపై నడుస్తున్న చర్చ పై టీమిండియా సారథి రోహిత్ శర్మ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ మాట్లాడుతూ.. ‘నేనిదివరకే చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నా. ఆటగాడికి ఎత్తు పల్లాలు సహజం. ప్రతి క్రికెటర్ తన కెరీర్ లో ఇలాంటి దశను ఎదుర్కుంటాడు.
ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతూ వేలాది పరుగులు చేసి అన్నిసెంచరీలు చేసిన ఆటగాడు ఫామ్ కోల్పోతే తిరిగి పొందడానికి ఒకటి, రెండు ఇన్నింగ్స్ చాలు. నేనైతే అదే అనుకుంటున్నాను..’ అని అన్నాడు.
కోహ్లీ ఫామ్ పై తనకు ఆందోళన లేదని అతడు తిరిగి పుంజుకుంటాడని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ.. ఎడ్జబాస్టన్ టెస్టులో 31 (రెండు ఇన్నింగ్స్ లలో) చేశాడు. రెండు టీ20లలో 12 పరుగులు చేశాడు. గురువారం ముగిసిన రెండో వన్డేలో 16 పరుగులు చేసి ఔటయ్యాడు.