- Home
- Sports
- Cricket
- రవిశాస్త్రి మాట విన్న బీసీసీఐ కొత్త అధ్యక్షుడు.. ఆ రెండు విషయాలపై దృష్టి పెడతానంటున్న బిన్నీ
రవిశాస్త్రి మాట విన్న బీసీసీఐ కొత్త అధ్యక్షుడు.. ఆ రెండు విషయాలపై దృష్టి పెడతానంటున్న బిన్నీ
BCCI President: బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎంపికయ్యాడు. మంగళవారం ముంబైలోని తాజ్ హోటల్ లో ముగిసిన సమావేశం తర్వాత బీసీసీఐ.. ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. బోర్డు అధ్యక్షుడయ్యాక రోజర్ బిన్నీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన తన ముందు రెండు తక్షణ కర్తవ్యాలు ఉన్నాయని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని బిన్నీ తెలిపాడు. తాను పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకున్నాక ఆ రెండు విషయాల మీద దృష్టి సారిస్తానని తెలిపాడు.
బిన్నీ మాట్లాడుతూ.. ‘బీసీసీఐ అధ్యక్షుడిగా నేను రెండు కీలక విషయాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. అందులో ఒకటి ఆటగాళ్ల గాయాలు. గాయాలను నివారించడం నా మొదటి ప్రాధాన్యత. ప్రపంచకప్ కు ముందు జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో భారత జట్టు మొత్తం ప్రణాళికనే ఇది ప్రభావం చేసింది. రెండోది, దేశంలోని పిచ్ ల మీద నేను దృష్టాసారిస్తా..’ అని తెలిపాడు.
బిన్నీ చెప్పినట్టు గత కొంతకాలంగా భారత జట్టును గాయాల బెడద వేధిస్తున్నది. ఒకరు కాకుంటే మరొకరు అన్నట్టుగా టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయాలపాలవుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మొదలుకుని సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, దీపక్ చాహర్, బుమ్రా, షమీ తదితర ఆటగాళ్లంతా కీలక సిరీస్ లకు ముందు గాయాలపాలవుతున్నారు.
ఇదే విషయమై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కూర్చుని మాట్లాడాలని.. సదరు ఆటగాడు జాతీయ జట్టుకు ఎంత అవసరమనేది ఫ్రాంచైజీలకు వివరించి అతడికి విశ్రాంతినిచ్చేలా ప్రణాళికలు రచిస్తే గాయాల బెడద నుంచి తప్పించుకోవచ్చునని సూచించాడు.
ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక బిన్నీ కూడా ఇదే విషయం గురించి ప్రస్తావించడంతో అతడు.. తన పాత మిత్రుడు, సహచర ఆటగాడు రవిశాస్త్రి ఆందోళనను అర్థం చేసుకున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. శాస్త్రి, బిన్నీ కలిసి 1983 వన్డే ప్రపంచకప్, 1985 వరల్డ్ ఛాంపియన్షిప్ తో పాటు భారత జట్టుకు కలిసి ఆడిన విషయం తెలిసిందే.
ఆటగాళ్ల గాయాలతో పాటు శాస్త్రి ఆ కార్యక్రమంలో దేశవాళీ క్రికెట్, స్టేడియాలలో వసతులు వంటివి చేపట్టాలని, బిన్నీ అధ్యక్షుడైతే క్రికెటర్ల తరఫున ఆలోచించి వారికి మంచి చేస్తాడనీ వ్యాఖ్యానించాడు. అయితే గ్రౌండ్స్ లో వసతుల గురించి బిన్నీ మాట్లాడకపోయినా దేశంలో పిచ్ ల మీద దృష్టి సారిస్తానని అతడు వ్యాఖ్యానించడం గమనార్హం.