అర్జున్ టెండూల్కర్ని అందుకే ఆడించలేదు.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ కామెంట్...
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ఇలాంటి దారుణమైన సీజన్లోనూ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ని తుది జట్టులో ఆడించే సాహసం చేయలేదు ముంబై ఇండియన్స్...

ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ నుంచి తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, కుమార కార్తీకేయ, డేవాల్డ్ బ్రేవిస్ వంటి కొత్త కుర్రాళ్లకు అవకాశం దక్కింది... ఆల్రౌండర్గా మెగా వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన అర్జున్ టెండూల్కర్ని ఈ సారి ఆడించే అవకాశం ఉందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్...
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో అయినా అర్జున్ టెండూల్కర్ ఆటను చూసే అదృష్టం దక్కుతుందని ఆశపడ్డారు చాలా మంది అభిమానులు. అయితే అప్పుడు కూడా అర్జున్కి అవకాశం రాలేదు..
అర్జున్ టెండూల్కర్కి ఐపీఎల్ 2022 సీజన్లో ఎందుకు అవకాశం ఇవ్వలేదో తాజాగా బయట పెట్టాడు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్...
‘అర్జున్ ఇంకా పూర్తిగా రాటుతేలలేదు. అతను ఇంకా కొద్దిగా పని చేయాల్సి ఉంది. సచిన్ వారసుడిగా, ముంబై ఇండియన్స్ వంటి టీమ్ తరుపున ఆడుతున్నప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకుంటారు...
అర్జున్ టెండూల్కర్ ఆ అంచనాలను అందుకోగలగాలి. అందుకే తుది జట్టులో వచ్చే ముందు అతను ఇంకా చాలా వర్కవుట్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అర్జున్ చాలా కష్టపడుతున్నాడు.. అయితే అది సరిపోదు.
అర్జున్ టెండూల్కర్ హార్ఢ్ వర్క్తో పాటు తన బ్యాటింగ్, ఫీల్డింగ్లో డెవలప్మెంట్ వచ్చిందని టీమ్ భావిస్తే, తప్పుకుండా ఆడిస్తాం... ప్రతీ ఒక్కరికీ ఛాన్స్ ఇవ్వడానికి, అర్హత ఉన్నవారికి అవకాశం ఇవ్వడానికి మధ్య చాలా తేడా ఉంది..
ముంబై ఇండియన్స్ వంటి టీమ్లో తుది జట్టులో చోటుని పోరాడి సాధించుకోవాలి... అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ చాలా మెరుగైంది. అయితే ఆల్రౌండర్కి బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్...