రాజస్థాన్ రాయల్స్కి దెబ్బ మీద దెబ్బ.. మరో ఫారిన్ ప్లేయర్ అవుట్... ఏకంగా నలుగురు...
ఐపీఎల్ 2021 సీజన్లో రెండో విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఆ విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయకముందే మరో షాక్ తగిలింది. బయో బబుల్లో ఉండలేక మరో విదేశీ ఆటగాడు, ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్, ఆరు మ్యాచులు కూడా ఆడకముందే నలుగురు విదేశీ ప్లేయర్లను మిస్ చేసుకుంది...
తాజాగా ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై, ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే అతను స్వదేశానికి పయనమై వెళ్లిపోయినట్టు సమాచారం. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం, బయో బబుల్లో ఉండలేకపోవడం వల్లే ఆండ్రూ టై, ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
2018 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన ఆండ్రూ టై, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి పర్పుల్ క్యాప్ కూడా అందుకున్నాడు.
మొదటి మ్యాచ్లో గాయపడిన బెన్ స్టోక్స్, ఐపీఎల్ 2021 సీజన్ నుంచి దూరమైన మొదటి ప్లేయర్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్, చేతి వేలి సర్జరీ కోసం బెన్ స్టోక్స్ను ఇంగ్లాండ్ పంపిన తర్వాత వరుస షాక్లు తగిలాయి...
ఐపీఎల్ 2021 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని లియామ్ లివింగ్స్టోన్... ఏడాది కాలంగా బయో బబుల్ సెక్యూలర్ జోన్లో గడుపుతున్నానని, విసుగుతో సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో అందుబాటులో లేని జోఫ్రా ఆర్చర్... లీగ్ మధ్యలో జట్టుతో కలుస్తాడని ఆశించింది రాజస్థాన్ రాయల్స్. అయితే ఆర్చర్ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని చెప్పిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, అతను ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చింది...
ఇప్పుడు ఆండ్రూ టై కూడా ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకోవడంతో ఏకంగా నలుగురు ఫారిన్ ప్లేయర్లను కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్...
బెన్ స్టోక్స్ స్థానంలో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ రస్సీ వాన్ దేర్ దుస్సేన్ను ఆడించాలని ప్రయత్నిస్తోంది రాజస్థాన్ రాయల్స్. అతనితో ఇంకా చర్చలు జరుగుతున్నప్పటికీ, దేశంలో కరోనా కేసుల దృష్ట్యా ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు విదేశీ క్రికెటర్లు.