రస్సెల్ అవుట్ చేయడానికి ధోనీ మాస్టర్ ప్లాన్?... సామ్ కుర్రాన్కి ఏం చెప్పాడంటే...
ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత్తా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి క్రికెట్ మజాని అందించింది. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కోల్కత్తా నైట్రైడర్స్...ఆండ్రే రస్సెల్, దినేశ్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్ వీరోచిత పోరాటం వల్ల 202 పరుగులు చేయగలిగింది...
22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54 హాఫ్ సెంచరీ చేసిన ఆండ్రే రస్సెల్.... సామ్ కుర్రాన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. కీలక సమయంలో రస్సెల్ అవుట్ కావడం కేకేఆర్ విజయంపై ప్రభావం చూపింది.
అంతకుముందు సామ్ కుర్రాన్ వేసిన ఓవర్లో 30 పరుగులు రాబట్టిన ఆండ్రే రస్సెల్... సామ్ కుర్రాన్ వేసిన బంతి వైడ్గా వెళ్తుందని భావించి వదిలేశాడు. అయితే అది కాస్తా వెనకనుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది...
మెరుపు ఇన్నింగ్స్తో కేకేఆర్ను రేసులో నిలబెట్టిన ఆండ్రే రస్సెల్, తాను అవుటైన విధానాన్ని నమ్మలేక షాక్లో ఉండిపోయాడు. అవుటైన తర్వాత నిరాశగా పెవిలియన్లో కూర్చోవడం టీవీల్లో కనిపించింది...
విధ్వంసకర బ్యాటింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుండెల్లో గుబులు రేపిన ఆండ్రే రస్సెల్ వికెట్ తీయడం వెనక సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాస్టర్ ప్లాన్ ఉందని భావించారు క్రికెట్ విశ్లేషకులు...
‘ఆండ్రే రస్సెల్ను అవుట్ చేయడానికి మేమేం ప్లాన్ చేయలేదు. రస్సెల్ అవుటైన తర్వాత అందుకోసం మాస్టర్ ప్లాన్ చేశామని చెప్పుచ్చు. కానీ అలా ఏం జరగలేదు..
సామ్ కుర్రాన్ కానీ, నేను కానీ ఆండ్రే రస్సెల్ను అవుట్ చేయడానికి ప్రణాళిక ప్రకారం ఏం చేయలేదు. అదో అద్భుతమైన బంతి. లెగ్ స్టంప్ అవతల సామ్ కుర్రాన్ చాలా బంతుల్ని వేశాడు. కానీ వాటికి వచ్చిన రిజల్ట్ వేరు...’ అంటూ చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
ఆండ్రే రస్సెల్ అవుటైన తర్వాత కూడా దినేశ్ కార్తీక్, ప్యాట్ కమ్మిన్స్ అద్భుతంగా పోరాడడంతో 202 పరుగులు చేయగలిగింది కేకేఆర్. ప్యాట్ కమ్మిన్స్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.