నా అభిమాన క్రికెటర్లు సచిన్, కోహ్లి.. కానీ మలింగలో అదంటే చాలా ఇష్టం : జెర్సీ భామ మృనాల్ ఠాకూర్
Mrunal Thakur: 2019లో బాలీవుడ్ లో వచ్చిన వికాస్ భాయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మృనాల్ ఠాకూర్.. ఆ తర్వాత వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటూ హిందీ సినిమాలో పాగా వేయడానికి చూస్తున్నది.
బాలీవుడ్ లో షాహిద్ కపూర్, మృనాల్ ఠాకూర్ లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో షాహిద్ కపూర్ క్రికెటర్ గా కనిపించనున్నాడు.
అతడి భార్యగా మృనాల్ ఠాకూర్ నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు భారత జట్టు దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లి అంటే అభిమానమని తెలిపింది.
ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో మృనాల్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ లు నా అభిమాన క్రికెటర్లు. వీళ్లిద్దరితో పాటు నేను శ్రీలంక మాజీ ఆటగాడు లసిత్ మలింగ ను కూడా బాగా ఇష్టపడతాను.
మలింగకు ఉండే పొడవైన, రింగు రింగుల కర్లీ హెయిర్ (ఉంగరాల జుట్టు) అంటే నాకు చాలా ఇష్టం..’అని ఈ అమ్మడు తెలిపింది.
మహారాష్ట్రకు చెందిన ఠాకూర్.. 2019లో బాలీవుడ్ లో వచ్చిన వికాస్ భాయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30 లో కూడా మెరిసింది. బాట్లా హౌస్ సినిమాలో జాన్ అబ్రహం భార్యగా నటించిన మృనాల్.. ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నది.
ఇక కొద్దిరోజులుగా ఈ సినిమా ప్రమోషన్లలో షాహిద్ కపూర్ కూడా క్రికెటర్లకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తుండటం తెలిసిందే. ఇటీవలే అతడు మాట్లాడుతూ.. తనకు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని లు అంటే ఎంతో అభిమానమని, వారి నుంచి తాను ఎంతో స్పూర్తి పొందానని చెప్పుకొచ్చాడు.
ఇదిలాఉండగా.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 31న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూసినా.. ఒమిక్రాన్ వ్యాప్తి తో దీనిని నిర్మాతలు వాయిదా వేశారు.