ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్కు గడువు పెంపు, ఎన్ని రోజులు పెంచారో తెలుసా?
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఇ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యల వల్ల ఈ ఒక్క రోజు పొడిగింపు ఇచ్చారు.

ఐటీఆర్ ఫైలింగ్
ఆదాయపు పన్ను శాఖ ముఖ్యమైన ప్రకటన చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే చివరి తేదీని పొడిగించింది. ఎక్కువ రోజులు పొడిగించిందేమో అనుకోకండి. కేవలం ఒక్కరోజు మాత్రమే.
ఎందుకు పెంచారు?
ఇ-ఫైలింగ్ పోర్టల్లో తలెత్తిన సమస్యల వల్ల వినియోగదారులు ఎదుర్కొన్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడానికే ఈ పొడిగింపు ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు ఏడు కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని, ఈ లెక్కింపు కొనసాగుతోందని పన్నుల శాఖ తెలిపింది. ఇంకా పన్ను దాఖలు చేయని వారు వెంటనే చేయాలని శాఖ కోరింది.
ఫిర్యాదులు చేశాక
గతేడాది జూలై 31 నాటికి 7.28 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల చాలా మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లింపులో, AIS (వార్షిక సమాచార నివేదిక) డౌన్లోడ్ చేయడంలో సమస్యలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దాని వల్లే ఇలా పొడిగించాల్సి ఉంటుంది.
ఇ ఫైలింగ్
చాలా మంది ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఇ-ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నారని తెలిపారు. ఈ ఫిర్యాదుల వల్ల పన్నుల శాఖ ఒక రోజు అదనపు గడువు ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 15 నుంచి ఒక రోజు పొడిగించి, సెప్టెంబర్ 16, 2025గా ప్రకటించింది. దీనికి ముందు, జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు పొడిగించారు.
నకిలీ సమాచారం
పన్నుల శాఖ సహాయ కేంద్రం పనిచేస్తూనే ఉందని వినియోగదారులు ఫోన్, లైవ్ చాట్, వెబెక్స్ సెషన్, X ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు. ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నకిలీవని, నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు.

