టీడీపీ నేతలపై కేసులు, తెర మీదికి బీసీ కార్డు: చంద్రబాబుకు వైసీపీ కౌంటర్ ఇదీ
తమ పార్టీకి చెందిన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ కేసులు పెడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ విమర్శలకు వైసీపీ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.
తమ పార్టీకి చెందిన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ కేసులు పెడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ విమర్శలకు వైసీపీ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.
రాష్ట్రంలో వరుసగా టీడీపీకి చెందిన నేతలపై కేసులు, అరెస్టులు చోటు చేసుకొంటున్నాయి. అరెస్టైన, కేసులు నమోదైన నేతలంతా బీసీలు. దీంతో టీడీపీ బీసీ కార్డును తెరమీదికి తీసుకొచ్చింది.
వైఎస్ జగన్ టీడీపీలోని బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని కేసులు పెడుతోందని విమర్శలు గుప్పించింది. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టడం, అరెస్టులు చేయడాన్ని టీడీపీ తప్పుబడుతోంది.
ఈఎస్ఐ స్కాంలో ఈ ఏడాది మే 12వ తేదీన టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసింది. అంతకుముందు రోజే తనకు ఆపరేషన్ అయినట్టుగా అచ్చెన్నాయుడు చెప్పినా వినకుండా ఏసీబీ అధికారులు 12 గంటల పాటు వాహనాల్లో శ్రీకాకుళం నుండి విజయవాడకు తీసుకురావడం వల్ల అచ్చెన్నాయుడుకు మరోసారి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి నెలకొందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక మహిళా మున్సిపల్ కమిషనర్ ను అసభ్యంగా తిట్టాడని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడిపై పలు కేసులు నమోదయ్యాయి. అయ్యన్నపాత్రుడిపై ఉద్దేశ్యపూర్వకంగా కేసులు నమోదయ్యాయని టీడీపీ నాయకత్వం ఆరోపిస్తోంది.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మూడు రోజుల క్రితం మచిలీపట్నంలో వైసీపీ నేత భాస్కర్ రావు హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య విషయం ముందుగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు తెలుసునని పోలీసులు ప్రకటించారు.బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు వైసీపీ ఈ రకంగా కేసులు బనాయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.ఈ ఆరోపణలపై వైసీపీ కౌంటరిచ్చింది.
తప్పు చేసిన వారికి కులాలు అంటగట్టడమేమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మచిలీపట్టణంలో వైసీపీ నేత భాస్కర్ రావు కూడ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడేనని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.బీసీ సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర అదే సామాజిక వర్గానికి చెందిన భాస్కర్ రావును హత్య చేయించడం సరైందేనా అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
బీసీ నేతగా చెప్పుకొంటున్న టీడీఎల్పీ ఉపనేత ఈఎస్ఐ స్కాంలో రూ. 150 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే తప్పు ఒప్పు అవుతోందా అని వైసీపీ టీడీపీని అడుగుతోంది.
మహిళా అధికారిని అసభ్యంగా తిట్టడం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికే చెల్లిందని వైసీపీ నేతలు దుయ్యబడుతున్నారు. తప్పులు చేసిన వారిపై కేసులు పెడితే బీసీ కార్డును లేవనెత్తుతారా అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
ఇంత కాలం పాటు టీడీపీ బీసీలను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కానీ, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీలను అన్ని రకాలుగా ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు వివరిస్తున్నారు.