షర్మిలకు వైసీపీ పగ్గాలు: కేసీఆర్ బాటలో సీఎం జగన్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి వైయస్ షర్మిల. వైయస్ షర్మిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవ్వడంతోపాటు ఎవరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవదని జగన్ భావించినట్లు తెలుస్తోంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆమె పాత్ర కీలకం. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సీఎం వైయస్ జగన్ సుమారు పదేళ్లపాటు నానా కష్టాలు పడ్డారు. ఆ పదేళ్లలో వైయస్ జగన్ వెన్నంటి నిలిచారు సోదరి వైయస్ షర్మిల.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లో దూసుకుపోయారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడం ఆతర్వాత ఆస్తుల కేసులో జగన్ 16 నెలలపాటు జైల్లో ఉండటం ఈ పరిణామాల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది వైయస్ షర్మిల అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తోడబుట్టిన చెల్లెలుగా తన కష్టాలను సైతం పంచుకున్న వైయస్ షర్మిలకు సీఎం వైయస్ జగన్ కీలక పదవి కట్టబెట్టారని ప్రచారం జరుగుతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా షర్మిలను జగన్ నియమించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
వైయస్ షర్మిల పార్టీకోసం, తన సోదరుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఆమె పడిన కష్టానికి ఫలితంగా షర్మిలకు పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పాలనపై పట్టు సాధిస్తున్న తరుణంలో పార్టీపై ప్రత్యేక దృష్టిసారించేందుకు షర్మిలకు పగ్గాలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను జగన్ లేనప్పుడు తల్లి వైయస్ విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో పర్యవేక్షించేవారు. అయితే ఆమె వయసు రీత్యా ఇబ్బందులు పడుతున్న తరుణంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితమయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి వైయస్ షర్మిల. వైయస్ షర్మిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవ్వడంతోపాటు ఎవరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవదని జగన్ భావించినట్లు తెలుస్తోంది.
తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసేందుకు వైయస్ షర్మిల ఎన్నో కష్టాలు పడ్డారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పట్టుదల, మెుక్కవోని ధైర్యంతో సోదరుడు వైయస్ జగన్ కు అండగా నిలబడింది.
పదేళ్లపాటు వైయస్ జగన్ కష్టాల్లో తోడుగా నిలిచింది. తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నేతగా ఎదిగితే తన తండ్రి స్ఫూర్తితో మరో ప్రజాప్రస్థానం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మరో తిరుగులేని నేతగా ఎదిగారు వైయస్ షర్మిల.
ఒక మహిళానేతగా పాదయాత్ర చేసిన వ్యక్తులలో వైయస్ షర్మిల ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో 230 రోజలపాటు పాదయాత్ర చేసిన ఏకైక మహిళా నేత షర్మిల అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో 2012 అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్రను ప్రారంభించారు. తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీ పరంగా ప్రజలకు తాను ఉన్నానంటూ ఆమె దిగ్విజయంగా పాదయాత్ర చేపట్టారు.
2013 జులై 29 వరకు అంటే 230 రోజుల పాటు సుమారు 3112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు వైయస్ షర్మిల. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆమె పాదయాత్రలో గర్జించిన తీరు ఇప్పటికీ అందరికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది.
అంతేకాదు 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైయస్ షర్మిల తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీపై పంచ్ డైలాగులతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతల నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓ రేంజ్ లో పంచ్ డైలాగులు విసిరారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ పప్పు అయితే తండ్రి చంద్రబాబు నాయుడు గన్నేరు పప్పు అంటూ ఆమె చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ కాంపైనర్ గా మారారు. సింహం సింగిల్ గా వస్తోంది అంటూ షర్మిల డైలాగులు యూట్యూబ్ లో హల్ చల్ చేశాయి. ఎన్నికల ప్రచారంలో ఆమె ఇచ్చిన పిలుపు బైబై బాబూ అన్న పదం టిక్ టాక్ లో ఒక సన్సేషన్ క్రియేట్ చేసిందంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
బై బై బాబూ, బైబై పప్పూ అంటూ ఆమె ఇచ్చిన పిలుపు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. జగనన్నకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆమె కోరిన తీరు అందరిని కట్టిపడేసింది. వైయస్ షర్మిల పంచ్ డైలాగులతో ఆమె ఎన్నికల ప్రచారంలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ , చింతమనేని ప్రభాకర్ వంటి వారే కాదు కీలక నేతలను సైతం తన ప్రచారంతో దుమ్ము దులిపేశారు. అమరావతి రాజధాని భూముల్లో వైయస్ షర్మిల ప్రచారం ఆ పార్టీకి ఎంతో మైలేజ్ తీసుకువచ్చిందని ఆ పార్టీ నేతలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు.
ఇకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం వదల్లేదు వైయస్ షర్మిల. చంద్రబాబు డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ యాక్టర్ అంటూ పదేపదే ఆరోపణలు చేశారు. డైరెక్టర్ ఏం చెబితే యాక్టర్ అదే చేస్తారు అంటూ ఆమె ప్రసంగంలో పవన్ పై విరుచుకుపడ్డారు.
అధికార పక్షాన్ని విమర్శించరు ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తానంటారు ఇదేనా మీ రాజకీయం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు అనధికారికంగా నడుస్తోందంటూ ఆమె పదేపదే ప్రచారం చేశారు.
అంతేకాదు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వైయస్ షర్మిల వస్తున్నారనుకున్న సమయంలో ఆమెను మానసికంగా ఇబ్బందిపెట్టేందుకు ఎన్నో కుట్రలు సైతం జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా షర్మిలపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల మధ్యకు వస్తుంటే సోషల్ మీడియా వేదికగా వస్తున్న పుకార్లు తీవ్ర ఇబ్బందులుకు గురిచేసినా వాటిపై పోరాడారు వైయస్ షర్మిల. వాటన్నింటిని ఎదుర్కొని ప్రజల మధ్యకు చేరారు.
ఇకపోతే ఎన్నికల సమయానికి ముందు షర్మిల బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి మరణంపై కూడా తీవ్ర విమర్శలు చేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు పసుపుకుంకుమ ఇస్తే వైయస్ జగన్ మీ చిన్నమ్మ పసుపుకుంకుమ తుడిచేశాడంటూ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు చేసిన విమర్శలు ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టినా వైసీపీని అధికారంలోకి తీసుకురావడం, ప్రజల పక్షాన తాము ఉండాలనే ధైర్యంతో ముందుకు వెళ్లారు వైయస్ షర్మిల.
మెుత్తానికి వైయస్ జగన్ పదేళ్ల కష్టం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన వైయస్ షర్మిల ఆతర్వాత మళ్లీ కనిపించలేదు.
పార్టీ పరంగా ఎన్ఆర్ఐలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారే కానీ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. అలాగని ఆమె ఏ పదవీ ఆశించలేదు కూడా. గతంలో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పార్టీ బాధ్యతలు మోసిన నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆమె పదవికి వన్నెతెస్తారని పార్టీ నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైయస్ షర్మిల అధికారికంగా నియమితులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ కేంద్ర పాలక మండలి, రాష్ట్ర పాలక మండలి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.