జగన్ వెనక ఆ ముగ్గురు: విజయమ్మ, షర్మిల, భారతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం వెనుక పదేళ్లకష్టం ఉంది. పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు వైయస్ జగన్.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం వెనుక పదేళ్లకష్టం ఉంది. పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు వైయస్ జగన్.
అంతేకాదు నమ్ముకున్న వాళ్లు కొంతమంది అధికారం కోసం పార్టీలు మారినా మెుక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూనే ఉన్నారు వైయస్ జగన్. కొందరు పార్టీలోకి రావడం, మరికొందరు పార్టీ వీడటంతో జగన్ ఒకింత ఆందోళన గురైనా ఎక్కడా తొనకలేదు బెనకలేదు.
పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి తీరా రాకపోయినా అదరలేదు బెదరలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీనుంచి చేజారుతున్నా ఆయన మాత్రం బెదరలేదు. కేవలం ఒక్కశాతం ఓట్లతో అధికారానికి దూరం కావడంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న కసితో వైయస్ జగన్ అడుగులు వేశారు.
అసెంబ్లీలో న్యాయం జరగకపోతే ప్రజల చెంతకు చేరారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో ప్రజలతో కలిసి అడుగుల వేశారు. జగన్ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్తున్నా ఆయన పట్టుదలతో ముందుకు సాగుతూనే ఉన్నారు.
ఇలా రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఆయన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది ముగ్గురే ముగ్గురు. ఆ ముగ్గురే కన్నతల్లి వైయస్ విజయమ్మ అయితే తోడబుట్టిన చెల్లెలు వైయస్ షర్మిల, జీవితాంతం తోడుంటానన్న భార్య వైయస్ భారతి.
వైయస్ విజయమ్మ దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్యగా ఎన్నో ఆటుపోట్లను చూశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను దగ్గరుండి గమనించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఎదుగుతున్న తీరును, కష్టాలను, విజయాలను అన్నింటిని గమనించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టడం, ఆ తర్వాత జైలుకు వెళ్లడం ఇలా ఎన్నో జరిగాయి. ఆస్తుల కేసుల పేరుతో నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతుండటం ఆ తల్లి తల్లడిల్లిపోయింది
జగన్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పరాభవాలను గమనించిన వైయస్ విజయమ్మ కొడుకు పరిస్థితి చూసి ఏమాత్రం చలించలేదు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. జగన్ ఎదుర్కొంటున్న ప్రతీ ఇబ్బంది నుండి అధిగమించాలని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించడంలో ఆమె గొప్పతనంగా పార్టీ చెప్పుకుంటోంది
16నెలల పాటు తనయుడు జైల్లో ఉన్నా ఆమె ధైర్యంగా కుటుంబానికి పెద్ద దిక్కుగా ముందుకు నడిపింది. కన్న తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ బాధ్యతలను సైతం భుజాన వేసుకున్నారు వైయస్ విజయమ్మ. కొడుకు పడుతున్న కష్టాలను తలచుకుని కంటతడి పెట్టుకున్నా వాటిని పంటికిందే దాచుకుంటూ కొడుకు వెన్నుతట్టి ప్రోత్సహించారు వైయస్ విజయమ్మ.
దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డిని 30 ఏళ్లుగా ప్రజలు ఆదరించారు. ఆయన బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలకు అప్పగిస్తున్నా. నాబిడ్డను మీ బిడ్డగా చూడాలంటూ వైయస్ విజయమ్మ ప్రజలను కోరడం అందరి మనస్సులను ఆకట్టుకుంది.
అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైయస్ విజయమ్మ. వయసుతో సంబంధం లేకుండా కొడుకు విజయం కోసం ఎండనకా వాననకా ఊరువాడా తిరిగారు.
2019 ఎన్నికల్లో అయితే రాజకీయాలపట్ల పూర్తి అవగాహన చేసుకున్న వైయస్ విజయమ్మ అధికార, విపక్ష పార్టీలపై నిప్పులు కురిపించారు. బీజేపీతో పొత్తు అన్న విమర్శలను తిప్పకొట్టడంలో విజయవంతం అయ్యారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయంలో మరో కీలక వ్యక్తి వైయస్ షర్మిల. వైయస్ జగన్ రక్తం పంచుకుని పుట్టిన వైయస్ షర్మిల అన్న విజయాన్ని కూడా పంచుకోవాలనుకుంది. అంతేకాదు అన్నకు ఆపదల్లో అండగా నిలిచింది.
వైయస్ జగన్ జైలుపాలైన తర్వాత పార్టీని కనుమరుగు చేయాలనుకున్న తరుణంలో జగన్ వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి దూసుకువచ్చింది వైయస్ షర్మిల. అన్నకు నేనున్నానంటూ భరోసా ఇచ్చింది. అన్నపెట్టిన పార్టీకి కొండంత అండగా నిలిచింది.
దేశంలో ఏ మహిళా చేయని సాహసం చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తండ్రి నేర్పిన బాటలో పయనించింది. తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎలా ఎదిగారో అదే దారిని ఎంచుకున్నారు వైయస్ షర్మిల.
రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్ షర్మిల పాదయాత్ర నిర్వహించారు. మరో ప్రజాప్రస్తానం పేరుతో 2012 అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్రను వైయస్ షర్మిల 2013 జులై 29 వరకు అంటే 230 రోజుల పాటు సుమారు 3112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల మధ్యకు వస్తుంటే సోషల్ మీడియా వేదికగా వస్తున్న పుకార్లు తీవ్ర ఇబ్బందులుకు గురిచేసినా వాటిపై పోరాడారు వైయస్ షర్మిల. వాటన్నింటిని ఎదుర్కొని ప్రజల మధ్యకు చేరారు.
2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె ఒక స్టార్ కాంపైనర్ గా మారారు. ఎన్నికల ప్రచారంలో ఆమె ఇచ్చిన పిలుపు బైబై బాబూ అన్న పదం సోషల్ మీడియాలో ఒక సన్సేషన్ క్రియేట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బై బై బాబూ, బైబై పప్పూ అంటూ ఆమె ఇచ్చిన పిలుపు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అంతేకాదు సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ పొత్తులపై వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారాయి.
ఇక వైయస్ జగన్ గెలుపులో మరో కీలక వ్యక్తి వైయస్ భారతీ రెడ్డి. కష్ట సుఖాల్లో తోడుంటానంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు కట్టుబడ్డ ఆమె భర్త కోసం ఎన్నో చేసింది. రాజకీయ కుటుంబ నేపథ్యమైనప్పటికీ ఆమె రాజకీయాలకు కొత్త
తనమామ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత భర్త వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురైన ప్రతీ కష్టాన్ని కడుపులో దాచుకుంటూ భర్తకు తోడుగా నిలిచిన ఒక గొప్ప అర్థాంగి. వైయస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైయస్ జగన్ ఓదార్పుయాత్ర చేపట్టి ప్రజల మధ్యకు వెళ్తే ఇల్లాలిగా తన బాధ్యతను ఇంటి బాధ్యతను చక్కదిద్దారు వైయస్ భారతీరెడ్డి.
ఆస్తుల కేసు పేరుతో భర్త వైయస్ జగన్మోహన్ రెడ్డిని దిల్ కుషా గెస్ట్ హౌస్ వద్ద సీబీఐ అధికారులు విచారణ చేపట్టడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడంతో ఆమె నిరసన గళం విప్పారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ వద్ద అత్త వైయస్ విజయమ్మ, మరదలు వైయస్ షర్మిలతో కలిసి నిరసనకు దిగారు.
తన భర్త తనకు దూరమవుతున్నారన్న బాధ తనను వెంటాడుతున్నా ఆ బాధను లోలోన దాచుకుని జగన్ కు అండగా నిలిచారు. అటు ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను భుజాన వేసుకుని వారికి తండ్రి దూరంగా ఉంటున్నారనే బాధ తెలియకుండా పెంచారు.
ఆ తర్వాత వారిని పోలీసులు అరెస్ట్ చేయడం వరకు వెళ్లింది. అయినా అదరలేదు బెదరలేదు. తాము ఎక్కడ బాధపడితే భర్త లక్ష్యం దూరమవుతుందోనని ఆమె లోలోన దాచుకుంటూ భర్తకు తోడుగా నిలిచారు వైయస్ భారతీరెడ్డి
16నెలలపాటు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు ఆమె అనుభవించిన నరకం అంతా ఇంతాకాదు. భర్త జైల్లో ఉండగా తన ఇద్దరు బిడ్డలను చూసుకోవడమే కాదు వ్యాపార లావాదేవీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు
అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తన భర్తను దొంగ అంటూ నేరగాడు అంటూ విమర్శలు చేస్తున్నా వాటన్నింటిని భరిస్తూ వచ్చారు. తన భర్త తప్పక వస్తాడు, సీఎం అవుతాడంటూ ధృఢంగా నమ్మిన నాయకురాలు వైయస్ భారతీరెడ్డి.
కడప జిల్లాలో ప్రతీ గడప తొక్కుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు భారతీరెడ్డి. తన బిడ్డలకు తల్లిగా, కష్టాల్లో ఉన్న భర్తకు కొండంత అండగా నిలుస్తూ జగన్ విజయంలో కీలక పాత్ర పోషించారు వైయస్ భారతీ రెడ్డి.
వైయస్ జగన్ గెలుపులో ఈ త్రిమూర్తుల కృషి అనిర్వచనీయం. అజరామం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు వైయస్ జగన్ అనే నేను అన్న పదం విన్న తర్వాత వారికళ్లలో కనబడే ఆనందం అంతా ఇంతకాదు.
తనయుడు తన కళ్లెదుటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో కొడుకు పడ్డ కష్టాన్ని చూసి ఆ తల్లి భావోద్వేగం లక్షలాది మందిని భావోద్వేగానికి గురి చేసింది. ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకేనని అంతా చెప్పుకునేలా చేశారు.
ప్రతీ పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ పాత్ర ఉంటుందన్నది ఎంత నిజమో వైయస్ జగన్ విజయం వెనుక వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల, వైయస్ భారతీరెడ్డిల పాత్ర అంత నిజం అనడంలో ఎలాంటి సందేహం లేదు.