అర్థరాత్రి ప్రియుడి ఇంటికివెళ్లి.. కత్తిపీటతో నరికిన ప్రియురాలు..
ఆరేళ్లుగా తనను ప్రేమించి.. మరో యువతితో పెళ్లి చేసుకున్న ప్రియుడిని కత్తిపీటతో దాడి చేసి హత్య చేసింది ఓ ప్రియురాలు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

తూర్పుగోదావరి జిల్లా : ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదని అతి దారుణంగా హతమార్చింది. అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి కత్తిపీటతో అతని మీద దాడి చేసే ప్రాణాలు తీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలయపాలెంలో చోటుచేసుకుంది.
తిరుమలాయపాలెంకి చెందిన ఒమ్మి నాగశేషు (25) తాపీ పని చేస్తుంటాడు. కుర్లు డిబేరా అనే యువతితో రాజమహేంద్రవరంలో చదువుకునే రోజుల నుంచి నాగశేషుకు పరిచయం ఉంది. డిబేరా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన యువతి. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
నాగ శేషు తన అవసరాల కోసం అప్పుడప్పుడు డిబేరా నుంచి దాదాపు రూ.2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. వీటిని ఆమె కొంత నగదు రూపంలోనూ.. మరికొంత బంగారు గొలుసు రూపంలో ఇచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం నాగశేషు కుటుంబానికి తెలిసింది.
వారికి ఈ వ్యవహారం ఇష్టం లేకపోవడంతో మరో యువతితో ఏడాది కిందట నాగశేషుకు వివాహం చేశారు. ఈ విషయం డిబేరాకు తెలియదు. ఇటీవలే ఈ విషయం తెలియడంతో నాగశేషును నిలదీసింది. తన దగ్గర తీసుకున్న డబ్బు, గొలుసు ఇచ్చేసేయాలని తెలిపింది. ఎన్నిసార్లు అడిగినా నాగశేషు వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో డిబేరా అతనిమీద కక్ష పెంచుకుంది.
తనకు దక్కని నాగశేషును చంపేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం శివన్నారాయణ అనే తన స్నేహితుడి సహాయం తీసుకుంది. బుధవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో బైక్ మీద శివన్నారాయణతో కలిసి నాగశేషు ఇంటికి వెళ్ళింది.
డాబా మీద పడుకున్న అతని దగ్గరికి వెళ్లి గట్టిగా నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర కోపానికి వచ్చిన డిబేరా తన వెంట తెచ్చుకున్న కత్తిపీటతో.. ముందుగా అనుకున్న పథకం ప్రకారం నాగశేషు మీద దాడి చేసింది. ఈ గొడవకు ఇంట్లోని వారంతా నిద్రలేచారు.
కొడుకు మీద దాడి చేస్తుండడంతో నాగశేషు తల్లి గంగ అడ్డుకోబోయింది. ఆమె మీద శివన్నారాయణ కర్రతో దాడికి దిగాడు. నాగ శేషు మీద కత్తిపీటతో దాడి చేసిన తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ గలాటాకు మేల్కొన్న స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని 108 వాహనంలో గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులకు సమాచారం అందించారు. గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నాగశేషును మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. అతని తల్లి గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.