రాజీ చేసిన జగన్: ఉప్పు.. నిప్పు, వల్లభనేనితో ఈ ఇద్దరు కలుస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలు ఆ పార్టీ నాయకత్వానికి తలనొన్పులు తెచ్చిపెట్టాయి. దీంతో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగాడు.
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించేందుకు జగన్ నడుంబిగించారు. కలిసి పనిచేయాలని యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ స్వయంగా సూచించారు. ఇప్పటికే ఉప్పు నిప్పుగా ఉన్న ఈ నేతలు కలిసి పనిచేస్తారా లేదా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుండి టీడీపీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకటావుపై విజయం సాధించారు. వెంకట్రావుపై స్వల్ప ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు.
ఎన్నికల ఫలితాలు రాకముందే వంశీ యార్లగడ్డ వెంకట్రావు ఇంటికి వెళ్లిన ఘటన అప్పట్లో కలకలం చోటు చేసుకొంది. ఈ ఏడాది మార్చిలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై టీడీపీ సస్పెన్షన్ వేటేసింది.
వైసీపీలో చేరిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావును కలిశారు. వంశీని పార్టీలో చేర్చుకోవడాన్ని యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా జగన్ వంశీకి స్వాగతం పలికారు.
ఈ నియోజకవర్గంలో వంశీ వర్గీయులకు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకే పార్టీలో ఉన్నా కూడ ఈ మూడు గ్రూపుల మధ్య సయోధ్య లేకుండా పోయింది.
దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులతో కలిసి పనిచేసేందుకు తాను ప్రయత్నించినా కూడ వారి నుండి తనకు ఆశించిన మేరకు సహకారం అందడం లేదని వంశీ భావిస్తున్నాడు.
ఈ మూడు వర్గాల మధ్య ఇటీవల కాలంలో తరచూ గొడవలు చోటు చేసుకొన్నాయి. ఈ పరిణామాలు వైసీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా వర్గీయులు ఒకటిగా పనిచేస్తున్నారని వంశీ వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు.
ఈ పరిణామాలపై సీఎం జగన్ ను కలిసి ఫిర్యాదు చేయాలని వంశీ నిర్ణయం తీసుకొన్నారు. గురువారం నాడు విద్యాకానుక ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో జగన్ యార్లగడ్డ వెంకట్రావు చేతిని వంశీ చేతిలో వేసి కలిసి పనిచేయాలని జగన్ సూచించారు.
జగన్ చేసిన సూచనను యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావు వర్గీయులు ఎలా తీసుకొంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బహిరంగంగా నేతలు చేతిలో చేయి వేసుకొన్నారు. కానీ మనసులు కలిశాయా లేదా అనేది ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
టీడీపీని దెబ్బతీసేందుకు వంశీ లాంటి నేతలకు జగన్ తమ పార్టీలోకి ఎంట్రీకి అవకాశమిచ్చారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నుండి చేరే నేతలకు పార్టీ నాయకత్వం పెద్దపీట వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం రాజీ చేసిన తర్వాతైనా ఈ నియోజకవర్గంలో నేతల మధ్య సయోధ్య కుదురుతోందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తోంది.