జనసేన పొత్తు ఎఫెక్ట్, పవన్ కల్యాణ్ తో దోస్తీ: కమెడియన్ అలీ అందుకే...
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు బిజెపి కార్యాలయానికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం సాగించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైనా ముఖ్యమైన పదవిని ఇస్తారని ప్రచారం సాగింది. అయితే, ఆయనకు ఏ విధమైన పదవి కూడా లభించలేదు.
కాగా, బిజెపి కార్యాలయానికి తాను వ్యక్తిగతమైన పని మీద వచ్చినట్లు అలీ చెబుతున్నారు. అయితే, జనసేన బిజెపితో పొత్తు పెట్టుకోవడం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సన్నిహితమైన సంబంధాలుండడం వంటి కారణాల వల్ల అలీ బిజెపి కార్యాలయానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని భావిస్తున్నారు.
అలీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినప్పుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. అలీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలీ కూడా అదే స్థాయిలో స్పందించి పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. వారి మధ్య ఆ సమయంలో మాటల యుద్ధం జరిగింది. అలీ తల్లి మరణించినప్పుడు చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించగా పవన్ కల్యాణ్ మాత్రం సోషల్ మీడియా వేదికగానే సానుభూతి తెలియజేశారు.
ఎన్నికల్లో వైసీపి తరఫున ప్రచారం చేసి పృథ్వీకి జగన్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే, ఆయన వివాదంలో చిక్కుకోవడంతో రాజీనామా చేశారు. మరో సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళికి కూడా ఏ విధమైన పదవీ ఇవ్వలేదు. జీవిత, రాజశేఖర్ దంపతులకు కూడా నిరాశే ఎదురైంది. అలీని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమిస్తారని ప్రచారం సాగింది. అయితే, ఇంకా కొలిక్కి రాలేదు.
వైసీపీ విజయం సాధించిన తర్వాత అలీ వైఎస్ జగన్ పట్ల అపారమైన విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని, వైసీపి అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పారు. మైనారిటీలంతా జగన్ కు అండగా నిలబడ్డారని కూడా చెప్పారు. ప్రజలు నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని ఎంపీలూ ఎమ్మెల్యేలూ నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు.
వైసీపీలో చేరిన సమయంలో అలీపై పవన్ కల్యాణ్ కాస్తా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. పాపులారిటీ చూసి జనం చప్పట్లు కొడుతారని, ఆ చప్పట్లను సీరియస్ గా తీసుకోకూడదని తన మిత్రుడు అలీకి ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి బలం ఉందని నమ్మి అలీ అటు వెళ్లారని కూడా అన్నారు.
ఆ తర్వాత కూడా పవన్ కల్యాణ్ అలీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్నేహమంటే ఇదేనా అని అలీని పవన్ కల్యాణ్ నిలదీశారు. వైసీపీ నేతలు అలీని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అలీని తాను ఆదుకున్నానని ఆయన అన్నారు. ఎంపీ టికెట్ ఇస్తానంటే అలీ వైసీపీలో చేరాడని కూడా అన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అలీ తీవ్రంగా ప్రతిస్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, అలీని తిట్టాలని పవన్ కల్యాణ్ చుట్టుపక్కల ఉన్నవారు చెప్పి ఉంటారని ఆయన అన్నారు. చిరంజీవి వేసిన బాటలో పవన్ కల్యాణ్ నడిచారని, తాను తన దారిని తానే వేసుకున్నాని ఆయన అన్నారు.
అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఆదుకున్నానని ఎన్నికల ప్రచారం పవన్ కల్యాణ్ అన్నారు. దానిపై కూడా అలీ ప్రతిస్పందించారు. ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలని, ధనం ఏమైనా ఇచ్చారా అని అన్నారు. సినిమాలు లేక ఇంట్లో కూర్చుంటే అవకాశాలు ఇప్పించారా అని అడిగారు. పవన్ కల్యాణ్ ఇండస్ట్రీకి రాక ముందే తాను మంచి స్థితిలో ఉన్నానని, తాను ఎవరి దగ్గరా దేబరించలేదని అన్నారు.
తనకు స్వేచ్ఛ లేదా, మీ గురించి నేను వ్యాఖ్యానిస్తే మీరు నా గురించి కామెంట్ చేయాలని. రాజమండ్రిలో మీరు కామెంట్ చేయడం సరి కాదు అని కూడా అలీ అన్నారు తాను వెళ్లి పవన్ కల్యాణ్ ను టికెట్ అడగలేదని, ఇచ్చే ముందు తనను అడగలేదని అననారు. తన నెంబర్ తన వద్ద ఉదని, 12 -14 ఏళ్ల నుంచి ఒకే నెంబర్ మెయింటెన్ చేస్తున్నారని పార్టీలోకి రావాలని ఎప్పుడైనా అడిగారా అని ఆయన అన్నారు.
జనసేనలో అప్పట్లో ఎందుకు చేరలేదో కూడా అలీ చెప్పారు. అలీ టీడీపీలో చేరినట్లే చేరి అకస్మాత్తుగా వైసీపీలోకి వచ్చారు. పవన్ కల్యాణ్ తో తనకు మంచి స్నేహం ఉందని, పవన్ కల్యాణ్ జనసేనలోకి తనను ఆహ్వానించలేదని, అందుకే తాను మరో పార్టీలోకి వెళ్లానని, ఎన్నికల్లో మాత్రమే వైసీపీ కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
వైసీపిలో చేరడానికి ముందు అలీ వరుసగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోనూ టీడీపి అధినేత నారా చంద్రబాబు నాయుడితోనూ భేటీ అయ్యారు. చివరకు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపిలో చేరారు. టీడీపీలో చేరుతారంటూ ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలోనే అకస్మాత్తుగా అలీ వైసీపీలో చేరారు.